వాషింగ్టన్ : ప్రముఖ టెక్ సంస్థ యాహూ ఉద్యోగులపై వేటు వేయనుంది. సుమారు 20 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు గురువారం ప్రకటించింది. యాడ్- టెక్ విభాగంలోని ఉద్యోగులను తొలగించనుంది. యాహూను 2021లో ప్రైవేటు ఈక్విటీ సంస్థ 'అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్' ఐదు బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఆఫీసు కార్యకలాపాలు ముగిసే సమయానికే కంపెనీలో 12 శాతం అంటే 1,000 మందిని తొలగిస్తున్నట్లు యాహూ తమ ఉద్యోగులకు తెలియజేసింది. మరో 8 శాతం అంటే 600 మందికి వచ్చే ఆరు నెలల్లో ఉద్వాసన పలుకుతామని పేర్కొంది. లాభదాయకతలేని కంపెనీ బిజినెస్ అడ్వర్టైజింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. తమ కీలక ప్రకటనల వ్యాపారమైన డి ఎస్ పిలో పెట్టుబడులను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు యాహూ తెలిపింది.










