Nov 22,2023 13:07

అమరావతి : ఇసుక స్కాం కేసుకు సంబంధించి సిఐడి నమోదు చేసిన కేసులో.. టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని క్రిమినల్‌ కేసు ద్వారా విచారణ జరపకూడదని వాదించారు. ఉచితంగా ఇసుకను ఇచ్చారు కాబట్టి ఖజానాకు నష్టం జరిగిందని అనడానికి వీల్లేదన్నారు. అది ప్రభుత్వ నిర్ణయం, సామాన్యులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేసిన నిర్ణయంగానే చూడాలని విన్నవించారు. ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టేందుకు ఏముంటుందని ప్రశ్నించారు. ఉచిత ఇసుక అనేది ఏవిధంగానూ చట్ట విరుద్ధం కాదని వాదించారు. ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో పేదలకు, భవన నిర్మాణ పనులకు అందుబాటులో ఉండేలా అప్పటి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని ఈ విధాన పరమైన నిర్ణయం తీసుకుందని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సిఐడి వాదనల కోసం విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.