Apr 17,2023 21:29

న్యూఢిల్లీ : దేశంలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ) ఎట్టకేలకు ఊరటనిచ్చింది. ప్రస్తుత ఏడాది మార్చిలో 1.34 శాతానికి తగ్గి 29 నెలల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ఇంతక్రితం ఫిబ్రవరిలో ఇది 3.85 శాతంగా చోటు చేసుకుంది. ముఖ్యంగా తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడంతో గత నెలలో ద్రవ్యోల్బణం దిగివచ్చిందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. 2022 మార్చిలో డబ్ల్యుపిఐ ఏకంగా 14.63 శాతం గరిష్ట స్థాయికి ఎగిసింది. 2020 నవంబర్‌ నుంచి వరుసగా 18 మాసాల పాటు రెండంకెల స్థాయిలోనే కొనసాగుతూ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. గడిచిన ఆరు మాసాల నుంచి ఒక్క అంకె స్థాయిలో నమోదవుతోంది. కానీ.. టెక్నికల్‌గా తగ్గుతున్నట్లు కనబడుతున్నప్పటికీ .. ఇప్పటికే పెరిగి ఉన్న ధరల పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.