వాషింగ్టన్ : బిబిసి డాక్యుమెంటరీ ''ఇండియా : ది మోడీ క్వశ్చన్ '' ఈ నెల 20న వాషింగ్టన్లో ప్రదర్శించేందుకు హక్కుల సంఘాలు సిద్ధమయ్యాయి. ప్రధాని మోడీ ఈ నెల 20 నుండి 25 వరకు అమెరికా, ఈజిప్ట్లలో పర్యటించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20న మోడీ న్యూయార్క్ చేరుకోనున్నారు. దీంతో భారతదేశంలోని మానవ హక్కుల పరిస్థితిపై ప్రపంచ దృష్టిని ఆకర్షిచేందుకు మానవ హక్కుల సంఘాలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ నెల 20న ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశాయి.
ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్, సెనెట్ సభ్యుల మధ్య మానవ హక్కులపై అర్థవంతమైన చర్చలు జరగాలని మానవ హక్కుల సంఘాలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పిలుపునిచ్చింది. భారత్లో మైనారిటీలపై ముఖ్యంగా ముస్లింలపై వివక్షకు సంబంధించి కొనసాగుతున్న ఆందోళనలను ప్రపంచం దృష్టికి తీసుకురావడమే ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన లక్ష్యమని పేర్కొన్నాయి. బిజెపి నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం తమ మద్దతుదారులు, హిందూత్వ సంస్థలు, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలతో మైనారిటీలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై అణచివేత, హింసాత్మక దాడులు, వివక్షను హక్కుల సంఘాలు రూపొందించిన 2022 వరల్డ్ రిపోర్ట్లో హైలెట్ చేశాయి.
భారతదేశంలోని మానవ హక్కుల పరిస్థితిని నేరుగా ప్రధాని మోడీతో ప్రస్తావించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్, కాంగ్రెస్ నేతలకు రాసిన లేఖలో హక్కుల సంఘాలు కోరాయి. మీడియాపై కొనసాగుతున్న అణచివేత, జర్నలిస్టుల ఏకపక్షంగా కొనసాగుతున్న అరెస్టులపై బైడెన్ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించాలని కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (సిపిజె) కోరింది. సిపిజె ఆసియా హెడ్ బెV్ా లిV్ా యితో మాట్లాడినట్లు ఆ వీడియోలో సిపిజె పేర్కొంది.