- తీర్మానాన్ని ఆమోదించిన అమెరికా సెనెట్ కమిటీ
శాన్ఫ్రాన్సిస్కో : అరుణాచల్ ప్రదేశ్ను భారత్లో అంతర్భాగంగా గుర్తిస్తూ అమెరికా సెనెట్ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించి నెల రోజులు కూడా గడవకముందే సెనెట్ ఈ చర్య తీసుకుంది. మెక్మహన్ రేఖను చైనాకు, భారత్కు మధ్య గల అంతర్జాతీయ సరిహద్దుగా అమెరికా గుర్తించిందని తీర్మానం పేర్కొంది. ఈ రేఖ అరుణాచల్ ప్రదేశ్ గుండా సాగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లోని పలు భాగాలు చైనా భూభాగంలోనివేనని చైనా చేస్తున్న వాదనలను తీర్మానం తోసిపుచ్చింది. సెనెటర్లు జెఫ్ మెర్కిలీ, బిల్ హాగెట్రీ, టిమ్ కైనే, క్రిస్ హాలెన్లు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. త్వరలోనే సెనెట్లో ఈ తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. స్వేచ్ఛకు, నియమ నిబంధనల ఆధారిత వ్యవస్థకు అమెరికా విలువిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా తమ చర్యలకు, సంబంధాలకు అదే కేంద్రంగా వుంటుందని సెనెటర్ మెర్కిలీ వ్యాఖ్యానించారు.










