ప్రజాశక్తి - ఆలమూరు : అనారోగ్యంతో గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెందిన ఘటన మండలంలోని జొన్నాడ సెంటర్లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుర్తుతెలియని 70 ఏళ్ల వృద్ధుడు గతకొంతకాలంగా జొన్నాడ సెంటర్ సమీపంలో బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా అతని మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆరోగ్యం క్షీణించి తారకరామ కాలనీ సమీపంలో మృతిచెంది ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై శ్రీను నాయక్ హుటాహుటిన తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులు, పంచాయతీ సిబ్బంది సమక్షంలో మృతదేహాన్ని అత్యక్రియలకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎవరికి భారం కాకూడదని, తమ జీవితకాలం తమ పిల్లల్ని పెంచి పోషిస్తారని, అవసరం తీరాక ఆస్తిపాస్తులు లాక్కుని తల్లిదండ్రులని ఇలా వదిలేయడం సరికాదన్నారు.










