Aug 17,2023 14:16

ముంబయి :   రైలులో కాల్పులకు పాల్పడిన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పిఎఫ్‌) కానిస్టేబుల్‌ చేతన్‌ సింగ్‌ చౌదరిని విధుల నుండి తొలగించింది. అతనిని విధుల నుండి తొలగిస్తున్నట్లు ఆర్‌పిఎఫ్‌ సీనియర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఈ నెల 14న ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. ప్రస్తుతం అతను జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. చౌదరి గతంలోనూ సుమారు మూడు క్రమశిక్షణా రాహిత్య చర్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. జులై 31 తెల్లవారుజామున జైపూర్‌ -ముంబయి సెంట్రల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్ర్‌ప్రెస్‌ పాల్ఘర్‌ స్టేషన్‌ సమీపంలో చేరుకున్న సమయంలో చౌదరి తన సీనియర్‌ అధికారి టికారమ్‌ మీనా, ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అనంతరం రైలు దిగి పారిపోతున్న చౌదరిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సీనియర్‌ సహా ముగ్గురు ప్రయాణికులపై ఎందుకు కాల్పులకు పాల్పడ్డాడన్న అంశంపై సమాచారం లేదు. అతను షార్ట్‌ టెంపర్‌ అని గతంలో వార్తలు వచ్చాయి.