ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని చైనాకు చెందిన ఇంజినీర్ల కాన్వాయ్ పై తీవ్రవాదులు దాడి చేశారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ లో ప్రముఖ ఓడరేవు నగరమైన గ్వాదర్లో ఆదివారం ఉదయం ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రవాదులను కాల్చిచంపినట్లు అధికారులు తెలిపారు. చైనా ఇంజనీర్లకు ఎలాంటి గాయాలు కాలేదని అన్నారు. చైనా -పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి)లో పెద్ద సంఖ్యలో చైనీయులు పనిచేస్తున్నారు.
గ్వాదర్లో చైనా ఇంజినీర్లకు చెందిన కాన్వాయ్ పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఎ) కాల్పులు జరిపినట్లు తెలిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాడిని ప్రతిఘటించాయని, సుమారు రెండు గంటల పాటు కాల్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. చైనా ఇంజినీరు, భద్రతా సిబ్బంది ఒకరు గాయపడినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు మరణించినట్లు తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పాకిస్తాన్ సెనేటర్ సర్పరాజ్ బుగ్తీ పేర్కొన్నారు.