Mar 27,2023 15:14

ప్రజాశక్తి-బాపట్ల : బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి వైసీపీ పార్టీ  రంగులు వేయడం తగదని, ప్రజల సొమ్ముతో ప్రజల కోసం నడుపుతున్న ఆసుపత్రిని ఒక పార్టీకి ఎలా పరిమితం చేస్తారని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ తీవ్రంగా ఖండించారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిని పార్టీ నాయకులతో కలిసి సందర్శించిన నరేంద్ర వర్మ అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించి, రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు గురుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో నరేంద్ర వర్మ మాట్లాడారు. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి దేవాలయంతో సమానం.. మీ ప్రచార పిచ్చి, ఆర్భాటాల కోసం ఆసుపత్రికి కూడా మీ పార్టీ రంగులు వేస్తారా అన్నారు. గతంలో ఇలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేస్తే కోర్ట్ మొట్టికాయలు వేసిన సంగతి మరిచిపోయారా!!,   పేరుకే జిల్లా కేంద్ర ఆసుపత్రి కానీ అందులో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎమ్మెల్యే కంటికి కనిపించడం లేదా అన్నారు.  అత్యవసర పరిస్థితుల్లో రోగిని ఆసుపత్రికి తీసుకు వస్తే సరైన వైద్యం చేయడానికి ఐసీయూ లేదు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండరు. వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ రంగుల పిచ్చి ఏమిటీ అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి పరిపాలన చేయడం చేతకాక, ఇలా రంగులు మారుస్తూ కోట్లాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారు.  బాపట్ల నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ అని స్వయంగా ముఖ్యమంత్రి  ప్రకటించిన సరే అది శంకుస్థాపన కే పరిమితం అయ్యిందా అన్నట్లుగా ఉంది కాని ఆశించిన స్థాయిలో పురోగతి లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వైసీపీ పార్టీ రంగులు మార్చేవరకు తెలుగుదేశం పార్టీ తరపున పోరాడతామన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో తక్షణమే 24 గంటలు అందుబాటులో ఉండేలా తగు వైద్య సిబ్బంది ని నియమించాలని , గైనకాలాజిస్ట్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేకంగా అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని నరేంద్ర వర్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.