ముంబయి : గత నెలరోజులుగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. తాజాగా మంగళవారం కూడా సెన్సెక్స్, నిఫ్టీలు గరిష్టస్థాయిని తాకాయి. సెన్సెక్స్ 3,600 పాయింట్లు లాభపడి రూ.66,985 ఆల్ టైమ్ రికార్డుకి చేరింది. నిఫ్టీ 1,000 పాయింట్లతో రూ. 19,811 రికార్డు స్ధాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల సహాయంతో పాటు విదేశీ నిధుల ప్రవాహం పెరగడం, అమెరికా ద్రవ్యోల్బణాన్ని తగ్గించనున్నారన్న సూచనలతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ ఏడాది జూన్లో విదేశీ పెట్టుబడిదారులు 5.7 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడంతో గతేడాది ఆగస్టు కన్నా నగదు ప్రవాహం పెరిగిందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డిఎల్) నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. జులైలో వరుసగా ఐదవ నెలలో కూడా ఎఫ్పిఐలు భారతీయ స్టాక్ మార్కెట్లలో నికర కొనుగోలుదారులుగా నిలిచాయి.










