ప్రజాశక్తి-తెనాలి : గ్రామ సచివాలయాల సిబ్బంది సమయపాలనకు ప్రాధాన్యమివ్వాలని జిల్లాకలెక్టర్ ఐ.శామ్యుల్ అనందకుమార్ చెప్పారు. మండలంలోని పెదరావూరుకు మంగళవారం వచ్చిన ఆయన గ్రామంలోని 1, 2 సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టీలను, సచివాలయాల ద్వారా పరిష్కరించాల్సిన దరఖాస్తుల వివరాలను పరిశీలించారు. అర్జీల స్వీకరణ, పరిష్కారం, సిబ్బంది విధులపై సిబ్బందికి సూచనలు చేశారు. రేషన్ కార్డులకు సంబందించిన దరఖాస్తులు మినహా, అన్ని దరఖాస్తులు పరిష్కరించినట్లు గుర్తించామన్నారు. గ్రామ సచివాలయాలపై తహశీల్దార్, ఎంపీడీవోల పర్యవేక్షణ అవసరమన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, కమిషనర్ ఎం.జస్వంతరావు, తహశీల్దార్ కె.రవిబాబు, ఎంపిడిఒ ఎల్.విజయాలక్ష్మణ్, గ్రామ కార్యదర్శి కె.సుబ్బారావు పాల్గొన్నారు.










