ప్రజాశక్తి-తెనాలి: సిఐటియు నాయకులు, మున్సిపల్ కార్మికులపై గత ప్రభుత్వంలో నమోదైన కేసును శనివారం తెనాలి కోర్టులో న్యాయమూర్తి కొట్టివేశారు. దీనికి సంబంధించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ వెల్లడించిన వివరాల ప్రకారం మున్సిపల్ కార్మికుల వ్యవస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు గత ప్రభుత్వం జీవో నెం.279ని విడుదల చేసింది. ఆ జీవో రద్దు కోరుతూ సిఐటియు నాయకులు, మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. సమ్మెను అణచివేసేందుకు ప్రభుత్వం నాయకులు, కార్మికులపై కేసులు బనాయించింది. దీనిలో భాగంగా తెనాలి మున్సిపల్ వర్కర్లు, సీఐటీయూ నాయకులు మొత్తం పది మందిపై కేసు నమోదైంది. దీనిని శనివారం న్యాయమూర్తి కొట్టివేయటంపై సీఐటీయూ నాయకులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. కేసు నుంచి విముక్తి పొందిన వారిలో జిల్లా నాయకులు నేతాజీతో పాటు, తెనాలి డివిజన్ అధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి, మరో ఎనిమిది మంది కార్మికులున్నారు.










