న్యూఢిల్లీ : మీరు వాగ్దానాలు, ప్రమాణాలను మర్చిపోయారా అంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బిజెపిని సూటిగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఫొటోను రావణాసురుడి రూపంలోకి మార్చి బిజెపి తన ఖాతాలో పోస్ట్ చేయడంపై ఆమె మండిపడ్డారు. '' మోడీజీ, నడ్డాజీ రాజకీయాలను, రాజకీయ చర్చలను మీరు ఏ స్థాయికి దిగజార్చాలనుకుంటున్నారు? మీ పార్టీ అధికారిక ఎక్స్ (ట్విటర్ ) ఖాతాలో హింసాత్మక, రెచ్చగొట్టే విధంగా ఉన్న పోస్టర్లు, ఫొటోలు పోస్ట్ చేయడంతో మీరు ఏకీభవిస్తున్నారా? ఇంకా సమయం ముగియలేదు.. ఇప్పటికైనా నిజాయితీగా ఉండండి. ప్రజలకు మీరిచ్చిన వాగ్దానాలు, చేసిన ప్రమాణాలను మర్చిపోయారా?'' అని ప్రియాంక హిందీలో ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ ఫొటోను రావణాసురుడి రూపంలోకి మార్చి బిజెపి గురువారం ట్విటర్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఈ చర్య భారతీయ సమకాలీన, రాజకీయ వ్యవస్థలో శతృత్వాన్ని, విభేధాలను సృష్టించడమేనని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ ఫొటోకు గ్రాఫిక్స్ను జోడించి పోస్ట్ చేయడం సిగ్గు చేటని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.










