
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 20 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9,43,14,589కి చేరగా.. ఇప్పటివరకూ 20,17,903 మంది మరణించారు. 6,73,45,871 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం శుక్రవారానికే మరణాల సంఖ్య 20 లక్షలు దాటిపోయాయి. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, కరోనా పుట్టినిల్లు అయిన వూహాన్లో తొలిమరణం నమోదైన ఏడాది తర్వాత మరణాల సంఖ్య 20 లక్షలకు చేరుకోవడం గమనార్హం. తొలి 10 లక్షల మరణాల నమోదుకు 8 నెలల సమయం పట్టగా.. తర్వాత 10 లక్షల నమోదుకు కేవలం 4 నెలలే పట్టింది. దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ 20 లక్షలు కేవలం అధికారికంగా నమోదు చేసిన మరణాలేనని, లెక్కలోకి రానివి ఇంకా చాలా ఉన్నాయని అంటున్నారు.