Oct 27,2023 15:37

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : డిసెంబర్ 8,9 తేదీలలో పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నరసరావుపేటలో జరగనున్న పల్నాడు బాలోత్సవం కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, ఎమ్మెల్సీ కెఎస్ లక్షణరావు, వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి  శ్రీనివాసరెడ్డి, టిడిపి కార్యాలయంలో టిడిపి నియోజకవర్గ బాద్యులు డాక్టర్  చదలవాడ అరవిందబాబులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలబాలికల్లో సృజనాత్మక ఆలోచనలు రేకెత్తించేలా బాలోత్సవాలు జరపాలని, ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. ఈ సందర్భంగా పల్నాడు బాలోత్సవం కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు మాట్లాడుతూ బాలబాలికలలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవాలు దోహదం చేస్తాయన్నారు.
 పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా చిత్రకళా పోటీలు నిర్వహించామని, ఈ పోటీలకు విశేష స్పందన లభించిందన్నారు. 1200 మందికి పైగా బాలబాలికలు చిత్రకళా పోటీల్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఈ అనుభవంతో పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పల్నాడు బాలోత్సవం అనే విభాగం ఏర్పడి పనిచేస్తుందని  పేర్కొన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీలలో నర్సరావుపేట పట్టణంలోని పిఎన్సి అండ్ కేఆర్ కళాశాల ఆవరణలో పల్నాడు జిల్లా స్థాయిలో ఈ బాలోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ బాలోత్సవాలకు పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి  విద్యార్థులు హాజరు కావచ్చన్నారు. 30 రకాల సాంస్కృతిక మరియు అకడమిక్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఇందులో జూనియర్స్ 6, 7 తరగతులు,సబ్ జనియర్స్ 3,4,5 తరగతులు, సీనియర్స్ 8,9,10 తరగతులు విభాగాలకు కలిపి మొత్తం 66 ఈవెంట్స్ లో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఈవెంట్ కు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయని, పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుందన్నారు. బాలోత్సవంలో పాల్గొనే బాలబాలికలకు ఉపాధ్యాయులకు భోజన తదితర వసతులు ఏర్పాటు చేయటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలలో పాల్గొనే  ప్రతి పాఠశాలకు బాలోత్సవం కమిటీ సభ్యులు ఎంట్రీ ఫారాలను తీసుకువెళ్లి అందిస్తారని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ పోటీలకు తమ విద్యార్థులను పంపించడానికి సహకరించాలని ఆయన కోరారు. ఎంట్రీ ఫారాలు  పూర్తి చేసి నవంబర్ 30 తేదీలోగా తమకు అందజేయాలని ఆయన తెలిపారు. అలాగే బ్రోచర్లో తెలిపిన క్యూఆర్ కోడ్ లేదా వెబ్సైట్ అడ్రస్ ద్వారా వారి ఎంట్రీలను అప్లోడ్ చేయవచ్చన్నారు.మరిన్ని  వివరాల కోసం పల్నాడు బాలోత్సవం కమిటీకి సభ్యుల  7207450369, 9440915861,
9491369330, 7893483132, 9390070555 ఫోన్ నెం.లలో  సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పల్నాడు బాలోత్సవం కమిటీ  అధ్యక్షులు ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్  రాజారెడ్డి, సహాయ కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వర రెడ్డి, కోశాధికారి కోయ రామారావు , కమిటీ సభ్యులు సాంబశివరావు, జి.శ్రీనివాసరావు, వెంకట్రావు,విజయసారధి,దార్ల బుజ్జిబాబు,నాగేశ్వర రావు, పల్నాడు విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కన్వీనర్ మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు.