Jan 02,2021 22:56
పేరేచర్లలో మోడల్‌ హౌస్‌ నమూనా నిర్మాణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌, అధికారులు

ప్రజాశక్తి - గుంటూరు : పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఆదివారం పేరేచర్ల లేఅవుట్‌లో జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లును జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పాల్గొంటున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారుల్ని ఆదేశించారు. లబ్దిదారులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నందున వారికి కావలసిన సదుపాయాలన్ని సమకూర్చాలన్నారు. లే అవుట్‌లోని అన్ని రహదారుల వద్ద ప్లాట్ల సంఖ్యను తెలుపుతూ సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పట్టాల పంపిణీకి వార్డుల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా స్టేజీ నిర్మాణం, మోడల్‌ హౌస్‌ నమూనా, శిలాఫలకాన్ని పరిశీలిం చారు. కార్యక్రమంలో జెసి కె.శ్రీధర్‌రెడ్డి, జిఎంసి కమిషనర్‌ చల్లా అనురాధ, డ్వామా పిడి శ్రీనివాస రెడ్డి, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఇ నతానియేల్‌, ఆర్‌డిఒ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.