ఓ ఊరిలో రామ్ అనే అబ్బాయి ఉన్నాడు. పాఠశాలకు సెలవులు ఇవ్వటంతో హైదరాబాద్లో ఉన్న తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇంటి పక్కనే ఉన్న గోపాల్తో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకే మంచి స్నేహితులయ్యారు. వారి ఇంటికి సమీపంలో ఓ పార్కు ఉంది. ఓ రోజు అక్కడ ఆడుకునేందుకు వెళ్లారు. దారిలో రామ్కి ఓ చెట్టు కింద నీడ ఏడుస్తూ కనిపించింది. అది అచ్చం తనలాగే ఉంది.
రామ్ 'ఏయ్ ! నీడ, ఎందుకు ఏడుస్తున్నావు?' అని అడిగాడు.
'ఎందుకంటే... మీరందరూ కలర్ ఫుల్గా ఉన్నారు. మీ నీడలమైనా మేము ఎప్పుడూ నలుపు రంగులోనే ఉంటాం. అందుకే మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మీ రంగుల ప్రపంచం చాలా బాగుంటుంది. మాకు అలా ఉండదు. మీలాగా మారాలంటే ఏం చేయాలి?' అని అడిగింది.
రామ్ 'ఓకే మై డియర్ షాడో, డోంట్ వర్రీ. నేను మీకు సొల్యూషన్ వెతుకుతాను. ఇప్పుడు నా స్నేహితుడు గోపాల్తో ఆడుకోవాలి' అని పార్కు వైపు పరుగుతీశాడు.
రామ్, గోపాల్ని కలిసి దారిలో జరిగింది చెప్పాడు. అప్పుడు గోపాల్ 'ఏంటి రామ్? నీ నీడ ఏడుస్తుందా? పద వెళ్లి చూద్దాం' అన్నాడు. ఇద్దరూ కలిసి చెట్టు దగ్గరకు వెళ్లారు. చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్న రామ్ నీడను చూశాడు. గోపాల్ ఆశ్చర్యంగా నీడ దగ్గరకు వెళ్లగా.. ఇంతలో గోపాల్ భుజం మీద ఎవరో తడుతున్నట్లు అనిపించింది. వెంటనే వెనక్కు తిరిగి చూశాడు. గోపాల్కు తన నీడ కనిపించింది. భయంతో బిగ్గరగా కళ్లు మూసుకొని 'షాడో షాడో...' అని అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఎవరో ముఖం మీద నీళ్లు చల్లడంతో కళ్లు తెరిచాడు రామ్. ఎదురుగా వాళ్ల అమ్మ కనిపించింది. ఎందుకు అరుస్తున్నావు? అని అడిగింది. రామ్ నిద్ర నుంచి తేరుకుని.. 'కల వచ్చింది మమ్మీ' అంటూ రామ్ సమాధానం ఇచ్చాడు.

- యార్లగడ్డ మౌర్య నాగ తేజ్ ,
5వ తరగతి, పోలిస్ పబ్లిక్ స్కూలు,
బెంగళూరు.










