విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలనే పట్టుదలతో చదవాలి : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక
ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పట్టణంలోని ఓసి క్లబ్ లో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ ను శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితో అరుణ్ కుమార్ సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఎల్సి మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గం లోని యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయికి రావాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ ను వినియోగించుకొని తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా చదువుకోవాలని సూచించారు. ఎన్నో లక్షల వ్యయంతో ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఉద్యోగం సాధించాలనే అకుంఠిత దీక్ష, పట్టుదలతో నిరంతరం సాధన చేయాలని చెప్పారు . కోచింగ్ సెంటర్ లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారు . విద్యార్థులకు ప్రేరణ -స్ఫూర్తి కలిగించేలా ప్రఖ్యాతిగాంచిన ప్రొఫెసర్లను, ఐపీఎస్ - ఐఏఎస్ ఆఫీసర్లతో మోటివేషన్ క్లాస్ లు ఏర్పాటు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కెవిఆర్ కళాశాల అధ్యాపకులు వాసుదేవరావు, నాని, పిజేఆర్ కోచింగ్ సెంటర్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.










