ప్రజాశక్తి-నందిగామ : నందిగామ మండలంలోని పల్లగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష పథకంలో డ్రోన్ ల వినియోగం, వాటి పనితీరును నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు బుధవారం పరిశీలించారు.భూముల రీసర్వే వివరాలు, సర్వే కోసం వినియోగించే పరికరాలను, సర్వే ద్వారా వస్తున్న ఫలితాలను నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి అధికారులు వివరించారు.ఈ సందర్భంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష పథకం ద్వారా భూముల రీ సర్వేకు శ్రీకారం చుట్టారని, దాదాపు 100 సంవత్సరాల తర్వాత సమగ్ర స్థాయిలో భూ సర్వే జరుగుతుందని, దీనిలో పూర్తిస్థాయి ఆధునిక టెక్నాలజీ ద్వారా డ్రోన్ లను వినియోగించి, అక్షాంశాలు -రేఖాంశాలతో సహా పారదర్శకంగా సర్వే నిర్వహించి హద్దు రాళ్ళను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. తద్వారా దశాబ్దాల నాటి భూ వివాదాలు పరిష్కారం కావడంతో పాటు భవిష్యత్తులో కూడా ఎలాంటి వివాదాలు ఏర్పడకుండా పాత భూ రికార్డులను ప్రక్షాళన చేస్తూ రీ సర్వే ద్వారా కొత్త భూ రికార్డులను నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీంద్ర, ఎమ్మార్వో నరసింహారావు, గ్రామ సర్పంచ్ రవి కిరణ్ రెడ్డి, ఎంపిటిసి రాము, గ్రామ రైతులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.










