- దేశవ్యాప్తంగా 954 మందికి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించిన పతకాలు ఆంధ్రప్రదేశ్కు చెందిన 29 మంది పోలీస్ అధికారులను వరించాయి. దేశవ్యాప్తంగా 954 మందికి సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను మంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. 229 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పిఎంజి), 82 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు (పిపిఎం), 642 మందికి పోలీస్ విశిష్ట సేవా (పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది. అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు పతకం (పిపిఎంజి) సిఆర్పిఎఫ్ అధికారి లౌక్రకామ్ ఇబోంచా సింగ్కు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అదనపు డిజి శంకబ్రత బాగ్చికి రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం (పిపిఎం) లభించింది. 18 మందికి పిఎంజి, 10 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలు లభించాయి. విశిష్ట సేవా పతకాలు లభించిన వారిలో దాదిరెడ్డి మురళీధర్ రెడ్డి (సిఐ, కర్నూల్ టౌన్), సింగులూరి వెంకటేశ్వరరావు (డిఎస్పి ఏలూరు), కొండపు ఆనంద రెడ్డి (డిసిపి విశాఖపట్నం సిటీ), సుంకర మునిస్వామి (రిజర్వ్ ఇన్స్పెక్టర్, మంగళగిరి), బెండి కాశీపతి (అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, విశాఖపట్నం), జమ్మలమడుగు నిసార్ అహ్మద్ బాషా (ఎఎస్ఐ), బెహరా నాగభూషణరావు (ఎస్ఐ), కన్నుజు వాసు (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గుంటూరు), మదా సత్యనారాయణ (ఎఎస్ఐ), తోట బ్రహ్మయ్య, (డిఎస్పి) ఉన్నారు.










