Jul 10,2023 22:17

న్యూఢిల్లీ : భారత్‌లో చిప్‌ల తయారీకి వేదాంతతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఫాక్స్‌కాన్‌ గుడ్‌బై చెప్పింది. సెబీ కండక్టర్‌ ప్లాంట్‌ ఏర్పాటు, తయారీకి సంబంధించిన సంయుక్త భాగస్వామ్యం నుంచి వైదొలుగుతున్నట్లు ఫాక్స్‌కాన్‌ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ ప్లాంట్‌తో భవిష్యత్తులో తమకు ఎలాంటి సంబంధమూ ఉండబోదని స్పష్టం చేసింది. సెమీ కండక్టర్ల ప్లాంట్‌ ఇక పూర్తి బాధ్యత వేదాంతదేనని తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు ఫాక్స్‌కాన్‌ తెలిపింది. గుజరాత్‌లో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు గతేడాది ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఫాక్స్‌్‌కాన్‌ వైదొలిగినప్పటికీ.. ఇతర భాగస్వాములతో కలిసి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తామని వేదాంత తెలిపింది.