
'విద్య ఒక సామాజిక వస్తువు. సరుకు కాదు. దీన్ని మార్కెట్లో అమ్మడం లేదా కొనడం చేయకూడదు. ప్రైవేటీకరణ అనేది విద్యాహక్కును కుదిస్తుంది' అంటారు నెల్సన్ మండేలా. 'రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణచివేసే సమాజంలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింప చేసేదే విద్య' అని ప్రముఖ విద్యావేత్త పాలో ఫ్రియరీ అభిప్రాయం. 1990లో నూతన ఆర్థిక సంస్కరణల ప్రారంభమైన తర్వాత ప్రభుత్వాలు అన్ని రంగాలతో పాటు విద్యను కూడా తమ పౌరులకు అందించవలసిన సామాజిక బాధ్యత నుండి తప్పుకొని మార్కెట్ శక్తుల చేతిలోకి పూర్తిగా అప్పగించే దిశగా ప్రయాణం ప్రారంభించి ఇప్పటికే మూడు దశాబ్దాలు దాటింది. భారతదేశంలో 1978లో ప్రయివేటు విద్యాసంస్థలలో 3.4 శాతంగా ఉన్న విద్యార్థులు 1993 నాటికి 9.2 శాతంగా పెరిగారు. 2021-22 యుడిఐఎస్ఇ ప్రకారం 2022 నాటికి ప్రయివేటు విద్యాసంస్థల్లో విద్యార్థులు 33 శాతానికి పెరిగారు. ప్రయివేటు పాఠశాలల సంఖ్య 2.3 శాతం నుండి నేడు 23 శాతానికి చేరాయి. ఈ గణాంకాలు గత మూడు దశాబ్దాల కాలంలో దేశంలో పాఠశాల విద్యలో 90 తర్వాత పెరిగిన ప్రైవేటీకరణ వేగాన్ని తెలియజేస్తున్నది. దాదాపు 8 కోట్ల 83 లక్షల మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. 3 లక్షల 41 వేల మంది ఉపాధ్యాయులు ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు. వీరు మొత్తం ఉపాధ్యాయుల్లో 38 శాతంగా ఉన్నారు. యునెస్కో వారి జిఇఎమ్ (గ్లోబల్ ఎడ్యుకేషన్ మోనిటరింగ్ రిపోర్ట్)-2022 నివేదిక ప్రకారం 2014 నుండి స్థాపించిన 97 వేల పాఠశాలల్లో 67 వేల ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. యునెస్కో గణాంకాల ప్రకారం 187 దేశాల్లో పాఠశాల విద్యను ప్రైవేటుపరం చేసిన దేశాల్లో భారత్ 15వ స్థానంలో ఉంది అంటే ఇక్కడ పాఠశాల విద్య ఎంత వేగంగా మార్కెట్ పరం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. మన పొరుగునే ఉన్న శ్రీలంకలో సైతం ప్రాథమిక స్థాయిలో 3.2 శాతం మంది విద్యార్థులు మాత్రమే ప్రయివేటు పాఠశాలల్లో చదువు తున్నారని యునెస్కో గణాంకాలు తెలియజేస్తున్నాయి.
భారతీయ సమాజంలో పిల్లలను చదివించుకోవాలనే ఆకాంక్ష పెరగడం ఒక సానుకూల అంశం. గతంలో లాగా పిల్లలకు నాలుగు అక్షరం ముక్కలు వస్తే చాలనుకునే దశ నుండి పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఈ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను స్థాపించి నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం విఫలం కావడం విద్యార్థులు ప్రైవేటు బాట పట్టడానికి ఒక ప్రధాన కారణం. యునెస్కో జిఇఎమ్-2022 ప్రకారం ప్రైవేటుకు వెళుతున్న విద్యార్థులలో 73 శాతం తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందటం లేదని, ఇంగ్లీష్ మీడియం విద్య కోసం 12 శాతం మంది, 10.2 శాతం ప్రభుత్వ స్కూలు అందుబాటులో లేకపోవడం వలన, 4.7 శాతం ఇతర కారణాలు ప్రైవేటు బాట పడుతున్నారని తెలియజేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏడు పాఠశాలలకు ఒక పాఠశాలలో ఐదు తరగతుల వరకు ఒకే ఒక ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. కానీ ప్రైవేటు పాఠశాలల్లో 81.4 శాతం పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఉండకూడదని అనేక నివేదికలు, ఎన్ఇపి (నూతన విద్యా విధానం) వంటివి సూచించాయి. అయినప్పటికీ ప్రభుత్వాలు ఉపాధ్యాయులపై బోధనేతర పనులు మోపడంతో బోధనా సమయం హరించుకుపోతున్నది. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను తీవ్రంగా దెబ్బతిస్తున్నది. అందువలన ప్రభుత్వ పాఠశాలలు సామాన్య ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయి. ఐదు తరగతులకు ఒకే ఒక ఉపాధ్యాయునిచే బోధించడం అంటే విద్యా హక్కును నిరాకరించడమే అవుతుంది. కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటికే దేశవ్యాప్తంగా 1:30 నిష్పత్తిలో పది లక్షల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి మొత్తం ఉపాధ్యాయులలో 15.7 శాతం. దీనినిబట్టే ప్రభుత్వ విద్యపై ప్రభుత్వాల ప్రేమ అర్థమవుతుంది.
- విద్య ప్రాథమిక లక్ష్యాలు పట్టవా?
విద్య ద్వారా సాంఘిక జాతీయ సమైక్యతను సాధించడం, ప్రజాస్వామిక విలువలు అభివృద్ధి పరచడం, సాంఘిక నైతిక విలువలను అభివృద్ధి పరచడం, అంతర్జాతీయ అవగాహన పెంపొందించడం వంటి లక్ష్యాలను కొఠారి కమిషన్ సూచించింది. జాతీయ విద్యా విధానం(ఎన్ఇపి)-1986 కూడా ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన, క్రీడలకు వ్యాయామానికి సముచిత స్థానం, లౌకికత మానవతా విలువలు పెంపొందించడం, విద్యలో సమాన అవకాశాలు కల్పించడం వంటి లక్ష్యాలను నిర్దేశించింది. నూతన విద్యా విధానం కూడా దాదాపుగా ఇదే లక్ష్యాలను సూచించింది. దాదాపుగా దేశంలో సగం మంది పిల్లలు చదువుతున్న ప్రైవేటు విద్యాసంస్థల నిర్వహణ, బోధనా విధానాలపై పర్యవేక్షణ లేకుండా భవిష్యత్తు భారతాన్ని నిర్మించలేం. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలు ఆశించిన మేర లేవనేది అసర్ నివేదిక, యునెస్కో వారి జిఇఎమ్ రిపోర్టుల ద్వారా స్పష్టం అవుతుంది. రెండవ తరగతి స్థాయి పాఠ్య పుస్తకాన్ని చదవగలిగిన 3వ తరగతి విద్యార్థులు 20.5 శాతం, ఐదో తరగతి విద్యార్థులు 42.8 శాతం మంది ఎనిమిదో తరగతి విద్యార్థులు 69.2 శాతం మంది మాత్రమే ఉన్నారు అంటే ఈ విద్యాసంస్థల్లో నాణ్యతను అర్థం చేసుకోవచ్చు. విద్య ప్రైవేటీకరణతో విద్యారంగంలో నూతన సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ప్రైవేటీకరణ విధానాలు పాఠశాలల్లో పెట్టుబడి పెట్టి నిర్వహించడం వరకే పరిమితం కావడంలేదు. విద్య ప్రాథమిక లక్ష్యాన్ని మరిచిపోయేలా నూతన లక్ష్యాలను, నిర్వహణ విధానాలను ప్రవేశపెడుతున్నాయి. ఇవి మార్కెట్ విలువలను పెంచే విధంగా విద్యను మార్చి విద్యలో మాధుర్యాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. విద్యాసంస్థల మధ్య లాభాల పోటీలో భాగంగా పాఠశాలల పని వేళలను పెంచటం, పాఠశాల స్థాయిలోనే జెఇఇ, నీట్, ఐఎఎస్ వంటి పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేయడమనే పేరుతో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నాయి. విద్యా స్వభావాన్ని మాత్రమే కాకుండా కీలకమైన సామాజిక సాంస్కృతిక సంబంధాలను కూడా రూపాంతరం చెందిస్తున్నాయి.
3.75 లక్షల కోట్ల డాలర్ల డిజిపితో ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 2025 నాటికి ప్రపంచంలో ఐదు ట్రిలియన్ల డాలర్లతో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతోందని ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా చెప్పుకోవడం చూస్తున్నాం. ఇటువంటి దేశంలో భావి భారత పౌరుల విద్య కోసం మూడు శాతం లోపు మాత్రమే ఖర్చు పెడుతూ...విద్యను అందించవలసిన బాధ్యత నుండి తప్పుకొని కార్పొరేట్ల చేతుల్లో పెట్టడం దేశభక్తి అవుతుందా? విద్యార్థులకు అసమాన అవకాశాలను కల్పించే ఈ విద్యా వ్యవస్థను మార్చి కొఠారి కమిషన్ సూచించిన విధంగా కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలి. కత్తులు దూసే విద్యా వ్యాపారంలో బలవుతున్న బాలల జీవితానికి రక్షణ కల్పించాలి. విద్యార్థులకు విరామ సమయం, ఆటలాడుకునే హక్కు, తగిన సౌకర్యాలు విద్యా సంస్థలు కల్పించాలి. విద్యావేత్తలు సూచించిన విధంగా ఏ తరగతి సిలబస్ను ఆ తరగతిలో మాత్రమే బోధించేలా చర్యలు తీసుకోవాలి. భావిభారత పౌరులకు నాణ్యమైన జీవనానికి గ్యారెంటీ ఇస్తూ పని హక్కును అంటే ఉద్యోగ గ్యారెంటీని కల్పించాలి. ఆ పేరుతో జరుగుతున్న వ్యాపారాన్ని అరికట్టాలి. అప్పుడు మాత్రమే అత్యంత ఆనందదాయకమైన దేశాల సరసన మన దేశం చేరుతుంది. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఆనందదాయక దేశాల జాబితాలో మన దేశం అన్నింటికన్నా చివరిన 136 దేశాలలో 126వ స్థానంలో ఉంది. అంటే ఈ దేశంలోనే ప్రజల ఎంత ఆనందంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మన పొరుగునే ఉన్న శ్రీలంక, నేపాల్, చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాల కన్నా వెనుకనే ఉన్నాం. విద్య పేరుతో జరుగుతున్న తంతులో బలవుతున్న బాలల హక్కులను కాపాడకుండా ఈ దేశంలోని ప్రజల ఆనందాన్ని రెట్టింపు చేయలేం. ఆనందదాయకమైన సమాజ నిర్మాణం కోసం విద్యావంతులు, బాలల హక్కుల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు పాలకులపై ఒత్తిడి తీసుకురావడం ద్వారానే ఆనందదాయక భారత్ను నిర్మించగలం.
వ్యాసకర్త - జి. వెంకటేశ్వరరావు, యుటిఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి,
సెల్ : 9966135289 /