న్యూఢిల్లీ : స్కాలర్షిప్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) పలు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో లెక్కల్లో చూపని రూ. 75 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఖాతాలలో ఉన్న సుమారు రూ. 2.55 కోట్లను స్తంభింపచేసినట్లు తెలిపారు.
సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నివేదిక ఆధారంగా ఈడి మనీలాండరింగ్ విచారణ చేపట్టింది. ఎస్సి, ఎస్టి మరియు ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద హిమాచల్ ప్రదేశ్ ఉన్నత విద్యా డైరెక్టర్ పంపిణీ చేసిన నిధులలో అవతవకలు జరిగినట్లు సిబిఐ పేర్కొంది.










