Nov 09,2023 22:35

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు తమ పార్టీ నాయకులపై పక్షపాతపూరితంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఇడిని బిజెపి రాజకీయ సాధనంగా వాడుకుంటోందని ఇసికి సమర్పించిన మెమొరాండంలో పేర్కొన్నారు. రాజస్థాన్‌ పిసిసి అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ దొతాసరా నివాసంపై దాడులు చేశారని, ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌కు నోటీసులు ఇచ్చారని వివరించారు. ఇడి ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ఎన్నికల ఏజెంట్‌గా పనిచేస్తోందని, ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌పై ధ్రువీకరించని ఆరోపణలతో ప్రకటనలు చేస్తోందని అన్నారు. అభిషేక్‌ మను సింఘ్వి నేతృత్వంలో పార్టీ నేతలు తారిక్‌ అన్వర్‌, ఉజిత్‌రాజ్‌తో కూడిన కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి, వినతిపత్రం సమర్పించింది. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఇడి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బిజెపి 'ఎన్నికల విభాగం'గా మారిన దర్యాప్తు సంస్థల కార్యకలాపాలను వెంటనే అడ్డుకోవాలని ఇసిని కోరామని చెప్పారు.