Sep 16,2023 14:48

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణకు సంబంధించిన క్లెయిమ్ ఫారంలను రెండు రోజుల్లో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి రాజాబాబు ఎన్నికల అధికారులను ఆదేశించారు. శనివారం  జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ వెంకటరమణ, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో  టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి  ఓటర్ల జాబితా సవరణ, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటరు నమోదు, తొలగింపులు, చేర్పులు మార్పులకు సంబంధించిన క్లెయిమ్ ఫారంలను రెండు రోజుల్లో పరిష్కరించాలన్నారు. హేతుబద్ధీకరణ ప్రకారం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు తగిన ప్రతిపాదనలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి పంపాలన్నారు. ఒకే ఇంటిలో 10 కంటే ఎక్కువగా ఓట్లు ఉన్న ఇంటిని మరొకసారి పరిశీలించి పక్కాగా రికార్డులు నిర్వహించాలన్నారు. రాబోయే రోజుల్లో ఎవరైనా విచారించినప్పుడు అవి  ఆధారాలుగా ఉంటాయన్నారు. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఈ విషయమై భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారన్నారు. మంగళవారం ఓటర్ నమోదు అధికారులు(ఈఆర్ఓలు), బూతు స్థాయి అధికారులతో సమగ్ర సమీక్ష జరిపి  పనితీరును పరిశీలిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ తాజా ఇతరుల ప్రకారం ప్రతి వారం బుధ, శుక్రవారం జగనన్నకు  చెబుదాం-స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి అధికారి ఒక డైరీ నిర్వహించాలని అందులో వారు పర్యటించిన మండలము, గ్రామము,  అర్జీదారుని పేరు పరిష్కరించిన సమస్య  మాట్లాడిన తీరు ఫోటో లేదా వీడియోతో సహా రికార్డు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అన్ని మండలాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ శాఖల వారీగా, సమస్యల వారీగా ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు. ఎన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి వివరాలు అందజేయాలన్నారు. వాటిపై సమీక్షించడం జరుగుతుందన్నారు. ఉదయం అర్జీలు స్వీకరించి వాటిని వివిధ శాఖల వారీగా  విభజించి గతంలో ఉన్న అర్జీలను కూడా తీసుకొని సంబంధిత అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి అర్జీదారుల సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. అవసరాన్ని బట్టి సంబంధిత పంచాయతీరాజ్,రెవెన్యూ, పోలీసు తదితర అధికారులు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది అన్నారు. అన్నింటి వివరాలను పక్కాగా రికార్డ్ చేయాలన్నారు. కేవలం గ్రామాలకు వెళ్ళాము వచ్చామని కాకుండా ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించాలన్నారు. ఎవరైనా అధికారులు తేలిగ్గా తీసుకొని నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం నేరుగా ముఖ్యమంత్రి కి చెప్పే కార్యక్రమం దీనిపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరిగా అవసరమని నిజాయితీగా విధులు నిర్వహించాలన్నారు.
అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నేడు మొదలైందని  ఈ విషయం ప్రజలందరితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజేసి అవగాహన కలిగించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిబ్బంది పూర్తిగా ఈ అంశం పైన బాధ్యత తీసుకోవాలన్నారు.  వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఏ ఇంటిలో ఎవరికి ఏ అనారోగ్యం ఉన్న నమోదు చేసుకుని వారికి టోకెన్లు ఇవ్వాలని ఈనెల 30వ తేదీన జరిగే వైద్య ఆరోగ్య శిబిరంలో వారు వైద్య చికిత్సలు చేయించుకునేలా కృషి చేయాలన్నారు. ఈనెల 30వ తేదీన వైద్య ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ఎన్నికల నమోదు అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు,  మునిసిపల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.