May 08,2023 22:53
  • లాభాల్లో 90% వృద్థి

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ తన ఇన్వెస్టర్లకు ఆకర్షణీయ డివిడెండ్‌ను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23కు గాను ప్రతీ రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై రూ.12 లేదా 120 శాతం డివిడెండ్‌ను అందించడానికి ఆ బ్యాంక్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ప్రతిపాదించారు. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభాలు 90 శాతం పెరిగి రూ.3,175 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,666 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.7,006 కోట్లుగా ఉన్న బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం.. క్రితం త్రైమాసికంలో 23 శాతం పెరిగి రూ.8,616 కోట్లకు చేరింది. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 5.35 శాతానికి తగ్గాయి. 2022 ఇదే మార్చి నాటికి జిఎన్‌పిఎ 5.89 శాతంగా ఉంది. ఇదే సమయంలో 2.65 శాతంగా బ్యాంక్‌ నికర నిరర్థక ఆస్తులు గడిచిన త్రైమాసికం ముగింపు నాటికి 1.73 శాతానికి తగ్గడం విశేషం. 2023 మార్చి ముగింపు నాటికి బ్యాంక్‌ గ్లోబల్‌ బిజినెస్‌ 12 శాతం పెరిగి రూ.20.41 లక్షల కోట్లకు చేరింది. గ్లోబల్‌ డిపాజిట్లు రూ.11.79 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ డిపాజిట్లు 6 శాతం పెరిగి రూ.10.94 లక్షల కోట్లకు చేరాయి. 2023 మార్చి ముగింపు నాటికి కెనరా బ్యాంక్‌ 9,706 శాఖలను కలిగి ఉండగా.. ఇదుంలో 3048 గ్రామీణ ప్రాంతాల్లో, 2742 శాఖలు చిన్న పట్టణాలు, 1991 పట్టణాలు, 1925 శాఖలు మెట్రో నగరాల్లో ఉండగా.. మొత్తంగా 10,726 ఎటిఎం శాఖలను కలిగి ఉన్నట్లు ఆ బ్యాంక్‌ వెల్లడించింది.