Sep 08,2023 11:50

న్యూఢిల్లీ :   ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లోని భాగేశ్వర్‌, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ, కేరళలోని పూత్తుపల్లి, త్రిపురలోని బాక్సానగర్‌, ధన్‌పూర్‌, పశ్చిమబెంగాల్‌లోని ధూప్‌గురి, ఝార్ఖండ్‌లోని దుమ్రి అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఉప ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ నియోజకవర్గంలో ప్రతిపక్ష కూటమి ఇండియా, ఎన్‌డిఎల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఈ నియోజకవర్గంలో 50.77 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) తెలిపింది. ఝార్ఖండ్‌లో 64.84 శాతం ఓటింగ్‌ నమోదైంది.

త్రిపుర ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపును బహిష్కరిస్తున్నట్లు సిపిఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 5న జరిగిన ఉప ఎన్నికల్లో రిగ్గింగ్‌ను అరికట్టేందుకు భారత ఎన్నికల సంఘం (ఇసి) ఎలాంటి చర్యలుచేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సెపాహిజాలా జిల్లాలోని బాక్సానగర్‌, ధన్‌పూర్‌ అసెంబ్లీ స్థానాల్లో సగటున 86.5 శాతం పోలింగ్‌ నమోదైంది.