Jan 04,2021 15:19

న్యూఢిల్లీ : థాయ్‌లాండ్‌లో జరిగే వరుస టోర్నీల్లో పాల్గొనేందుకు సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌ బ్యాంకాక్‌కు పయనమయ్యారు. ఈనెల 12 నుంచి 17 వరకు 'యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టోర్నీ'తో పాటు 19 నుంచి 24 వరకు జరిగే 'టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టోర్నీ'లో ఆడేందుకు భారత బృందం బ్యాంకాక్‌ వెళ్లింది. డబుల్స్‌ ఆటగాళ్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి, అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి.. సింగిల్స్‌ ఆటగాళ్లు ప్రణయ్‌, కశ్యప్‌, సమీర్‌ వర్మ, ధ్రువ్‌ కపిల, మనూ అత్రి కూడా వెళ్లారు. లక్ష్యసేన్‌ వెన్ను నొప్పి కారణంగా చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. సైనా, కశ్యప్‌, ప్రణయ్‌, సమీర్‌ వర్మ, మను అత్రి హైదరాబాద్‌ నుంచి బయల్దేరారు. 'చాలా రోజుల తర్వాత జరుగుతున్న టోర్నీ. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం' అని భార్య సైనాతో ఉన్న ఫొటోను కశ్యప్‌ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. గత అక్టోబర్‌ నుంచి లండన్‌లోనే ఉంటూ అక్కడే ప్రాక్టీస్‌ చేసిన పివి సింధు లండన్‌ నుంచి బ్యాంకాక్‌ చేరనుంది. హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు సింధుతో కలిసి తీసుకున్న ఫోటోను ఇంగ్లాండ్‌ డబుల్స్‌ ఆటగాళ్లు బెన్‌ లేన్‌, సీన్‌ వెండీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

బ్యాడ్మింటన్‌ షెడ్యూల్స్‌ ఇలా..
జనవరి 12 నుంచి 24 వరకు థాయ్‌లాండ్‌ ఓపెన్‌
మార్చి 17 నుంచి 21 వరకు ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌
మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 4 వరకు మలేషియా ఓపెన్‌
జూన్‌ 8 నుంచి 13 వరకు ఇండోనేషియా ఓపెన్‌
ఆగస్టు 24 నుంచి 29 వరకు హైదరాబాద్‌ ఓపెన్‌
సెప్టెంబర్‌ 21 నుంచి 26 వరకు విక్టర్‌ చైనా ఓపెన్‌
సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 3 వరకు జపాన్‌ ఓపెన్‌
అక్టోబర్‌ 19 నుంచి 24 వరకు డెన్మార్క్‌ ఓపెన్‌
అక్టోబర్‌ 26 నుంచి 31 వరకు ఫ్రెంచ్‌ ఓపెన్‌
నవంబర్‌ 9 నుంచి 14 వరకు చైనా ఓపెన్‌
డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌