Feb 11,2021 07:19

కోవిడ్‌-19 కారణంగా దేశంలో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమైంది. నిర్లక్ష్యానికి గురవుతున్న, అంతకంతకు పెరుగుతున్న ఆకలి-ఆహార కొరత అనేది నిశ్శబ్ద అత్యవసర పరిస్థితిలా దాపురించింది. అయితే పాలకులు అందుకు తగిన ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. దురదృష్టవశాత్తు కేంద్ర బడ్జెట్‌ కూడా ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఎటువంటి చర్యలను ప్రతిపాదించలేదు.
ఇటీవల విడుదలైన 'జాతీయ కుటుంబ సర్వే' ప్రకారం పిల్లల పోషకాహార లోపాలకు సంబంధించిన స్థాయిలు అనేక రాష్ట్రాలలో 2016 కంటే 2019లో అత్యధికంగా ఉన్నాయి. గత సంవత్సర కాలంగా అత్యంత పేద, శ్రామిక తరగతుల కుటుంబాలలో వేతనాలు పడిపోవటం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. ఈ మధ్య కాలంలో అంటే, అక్టోబర్‌ 2020 మరియు డిసెంబర్‌ 2020లో 'హంగర్‌ వాచ్‌', 'అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ' నిర్వహించిన క్షేత్ర స్థాయి సర్వే ఒక కఠోర వాస్తవాన్ని వెల్లడించింది. మూడింట రెండు వంతుల ప్రజల ఆహార సేకరణ స్థాయి ఈరోజుకి కూడా...లాక్‌డౌన్‌ నాటికి ముందున్న స్థాయికి రాలేదని తెలిపింది. పోషకాహార లోపం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా ఆహార లభ్యత, ఆరోగ్యం మీద ఇది ఆధారపడి ఉంటుంది. ప్రపంచమంతటా వ్యాపించి వున్న కోవిడ్‌ మహమ్మారి, ఆర్థిక మాంద్యం, ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత, దీనికి తోడు గతంలోనే పెరిగిన నిరుద్యోగం, గ్రామీణ వేతనాల్లో స్తబ్దత...కుటుంబ ఆహార భద్రతను తీవ్రంగా దెబ్బ తీసింది. గణాంకాలను పరిశీలిస్తే కోవిడ్‌-19 కన్నా ముందుగానే, అత్యధిక శాతం భారతీయులకు పోషకాహారం అంతంత మాత్రంగానే అందుతోంది.
ఈ నేపథ్యంలో అంగన్వాడీ మరియు పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం, పిల్లల పౌష్టికాహారం, గర్భిణీలు-బాలింతల విషయంలో ప్రత్యక్ష పోషకాహార పథకాలు కీలక పాత్ర పోషించాయి. 2020-21 సవరించిన బడ్జెట్‌ అంచనాలో అంగన్‌వాడీ సేవల కోసం కేటాయించింది రూ.17,252.3 కోట్లు. బడ్జెట్‌ అంచనా రూ.20,532.4 కోట్లతో పోలిస్తే ఇది వాస్తవ అంచనా డిమాండ్‌ రూ. 24,180 కోట్ల కంటే తక్కువగా ఉంది. ఫలితంగా, అంగన్వాడీ సేవలపై తీవ్రమైన ప్రభావంపడి అవి మూత పడడానికి దోహదం చేశాయి. దీనివల్ల అనుబంధ పోషక పదార్థాలను సమకూర్చడంలో తీవ్రమైన అంతరాలు ఏర్పడ్డాయి. సవరించిన అంచనాలు... వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తాయా లేదా అనే స్పష్టత రాలేదు. ఎందువల్లనంటే, కాగ్‌ లెక్కల ప్రకారం మొత్తం స్త్రీ శిశు సంక్షేమ, అభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంకాలు (ఇతర రంగాలతో పాటు అంగన్వాడీ సర్వీస్‌ స్టేషన్‌ను నిర్వహిస్తుంది) డిసెంబర్‌ 2020 నాటికి రూ. 14,607.1 కోట్లు (బడ్జెట్‌ అంచనాలో 49 శాతం) ఖర్చు పెట్టారని తెలిపాయి.
ప్రస్తుత బడ్జెట్‌లో వివిధ రకాల పథకాలను కలిపివేశారు. ప్రస్తుతం అంగన్వాడీ సేవలన్నీ కూడా 'సాక్షమ్‌ అంగన్వాడి మరియు పోషణ్‌ 2.0'లో భాగమయ్యాయి. దీనికి రూ. 20,105 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. 2020లో 'సాక్షమ్‌'లో కలిపి వేసిన పథకాలకుగాను అత్యధికంగా కేటాయించినది రూ.24,557.4 కోట్లు.
పౌష్టికాహారానికి, స్త్రీ, శిషు సంక్షేమ శాఖకు సంబంధించి రెండు ముఖ్యమైన జోక్యాలను గమనించవచ్చు. సవరించిన అంచనాలకు సంబంధించి, 'జాతీయ పౌష్టికాహార మిషన్‌' (పోషణ్‌)లో ఎక్కువ భాగం ఖర్చుకాని భాగాన్ని చూస్తాం. 2020-21కి గాను, బడ్జెట్‌ అంచనా రూ.3,700 కోట్లకు గాను 600 కోట్లు మాత్రమే ఖర్చయింది. ప్రధానమంత్రి మాతృ వందన యోజన (గర్భిణీ స్త్రీలకు రూ.5000 నగదు బదిలీ పథకం)కు బడ్జెట్‌ అంచనా రూ. 2,500 కోట్లతో పోల్చి చూసినప్పుడు సవరించబడిన అంచనాలు రూ.1,300 కోట్లుగా ఉన్నాయి. ఈ పథకం ప్రస్తుతం బేటీ బచావో బేటీ పఢావో, మహిళా శక్తి కేంద్రాలతో పాటు సమర్త్యలో భాగంగా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే కేటాయింపులు తక్కువగా ఉన్నాయి (రూ.2,828 కోట్లకు గాను, రూ.2,522 కోట్లు). మధ్యాహ్న భోజన పథకానికి 2021-22 కేటాయింపులు రూ. 11,500 కోట్లు. అంటే 2021 సంవత్సరానికి సవరించిన అంచనా బడ్జెట్‌ (రూ.12,900 కోట్ల) కంటే తక్కువగా ఉంది. అనేక సంవత్సరాల నుండి పౌష్టికాహార పథకాలకు బడ్జెట్లో అతి తక్కువ కేటాయింపుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెరుగుతున్న పౌష్టికాహార లోపానికి అనుగుణంగా కేటాయింపులు చేయడంలో నిర్లక్ష్యం జరుగుతున్నది.
ఇతర సామాజిక సంక్షేమ పథకాలు వృద్ధాప్య, వితంతు మరియు వికలాంగ భృతి లాంటి పథకాలు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించేందుకు సహకరిస్తాయి. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎలాంటి మెరుగుదల లేదు. వలస కార్మికుల విషయంలో కూడా ఒక పోర్టల్‌ను విడుదల చేయడం తప్ప ఎలాంటి ప్రత్యేక పథకాలను ప్రకటించలేదు. 'ఒకే దేశం ఒకే రేషన్‌' పథకం సమస్యలలో చిక్కుకుంది.
ఆహార సబ్సిడీ మూడు రెట్లు పెరిగినట్లు కనిపించినప్పటికీ...రాయితీలతో కూడిన ఆహార ధాన్యాలను పెద్ద మొత్తంలో పంపిణీ చేయడంలో ప్రతిబింబించడం లేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం బడ్జెట్‌ పుస్తకాలలో సవరణలను మాత్రమే ప్రతిబింబిస్తుంది. వాస్తవంగా ప్రభుత్వం ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను రుణాలు తీసుకోమని ఒత్తిడి చేయడానికి బదులుగా, ఎఫ్‌సిఐ కి ఇవ్వవలసిన బాకీలను తిరిగి చెల్లిస్తుంది. డిసెంబర్‌ 31 2020 నాటికి ఎఫ్‌సిఐ అప్పుల మొత్తం రూ.3.7 లక్షల కోట్లుగా ఉంది. ఆహార సబ్సిడీకి, తగినన్ని నిధులు కేటాయించకపోవడం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఈ అప్పులు పోగుబడి ఉన్నాయన్నది వేరే విషయం. సవరించిన అంచనాలలో చూపించిన అదనపు నిధులు, గత సంవత్సరపు బడ్జెట్‌ అంచనాలపై రూ. 3.1 లక్షల కోట్లు, జాతీయ సామాజిక భద్రతా నిధికి ఎఫ్‌సిఐ ఇవ్వవలసిన అప్పుతో సరితూగుతాయి. 2021-22 గాను ఆహార సబ్సిడీ కేటాయింపులు (రూ.2.4 లక్షల కోట్లు) గత సంవత్సరపు బడ్జెట్‌ అంచనాల కంటే చాలా అధికంగా ఉండడమేకాక, వాస్తవ నిబంధనలతో జాతీయ ఆహార భద్రతా చట్టాల అర్హతలకు తగినట్టుగా ఉంటుంది. కానీ వాస్తవం ఏమిటంటే...అనేక మంది నిపుణుల సూచించినట్టుగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) విస్తరణకు అవసరమైన కేటాయింపులు మాత్రం...అందులో లేవని స్పష్టమవుతుంది.
దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమంటే వాస్తవానికి ఆరోగ్య బడ్జెట్‌ కూడా పెరగలేదు. ఈ సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్‌...2020- 21 బడ్జెట్‌ కోసం సవరించిన అంచనాల కంటే తక్కువగా ఉన్నది. పెరిగిన కేటాయింపులు కేవలం కోవిడ్‌-19 కోసం కేటాయింపులుగానే కనిపిస్తాయి. ఇది ఈ ఒక్కసారి ఖర్చు చేయడం కోసమే. ఇది ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఏమాత్రం సహకరించదు.
మొత్తంగా ఆకలిని నివారించే దృష్టి కోణంలో చూసినట్లయితే ఈ బడ్జెట్‌ ఆ దిశలో విఫలమైంది. మొత్తం ఖర్చు రూ. 34,83,236 కోట్లలో కేవలం రూ.32,932 కోట్లు గత సంవత్సరపు సవరించిన అంచనాలకు సంబంధించినవే. గత సంవత్సరం కంటే రూ. 4,00,000 కోట్లు మాత్రమే ప్రస్తుత బడ్జెట్‌కు అదనంగా ఉంది. ఈ తేడా ఆహార సబ్సిడీ సంఖ్యలలో సవరణలుగానే చూడాలి. సంవత్సర కాలంలో ఆర్థిక మందగమనానికి సంబంధించిన బడ్జెట్‌ను మనకు సమర్పించారు. పెరుగుతున్న అసమానతల నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ అందరి అవసరాలను తీర్చడంలో విఫలమైంది.
                                   ఆకలి మహమ్మారిని నిలువరించలేని బడ్జెట్‌     దీపా సిన్హా  - వ్యాసకర్త ఢిల్లీ లోని అంబేద్కర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్
                                                                   ('ద హిందూ' సౌజన్యంతో)