
కరాచీ: ప్రపంచ స్థాయి పోటీ క్రికెట్ వేదికయిన భారత్ టి20 టోర్నమెంట్ లో తమ దేశ ఆటగాళ్లకు చోటు లేకపోవడం వల్ల నష్టపోతున్నామని పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ఆవేదన వ్యక్తపరిచారు. 2008 సీజన్ తర్వాత నుంచి పాకిస్థాన్ క్రికెటర్లు భారత్ లీగ్లో ఆడలేదు.
దీనిపై పాకిస్థాన్ మీడియాలో అఫ్రిది స్పందిస్తూ.. '' భారత్ నిర్వహించే టి20 టోర్నీకి ఎంతో బ్రాండ్ ఉంది. బాబర్ అజామ్, ఇతర పాక్ క్రికెటర్లు ఆ లీగ్లో ఆడితే ఆట ఒత్తిడిలో మరింత రాణించడానికి అలవాటుపడతారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రస్తుత విధానాల వల్ల ప్రపంచ స్థాయి పోటీ వేదికలో మా దేశ క్రికెటర్లు ఆడకపోవడం వల్ల నష్టపోతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఇతర లీగుల్లో మా ఆటగాళ్లకు డిమాండ్ ఉంది. మా దేశంలోనే టాప్ లీగ్ ఉంది. ప్రతిభను పెంచుకోవడానికి, ప్రదర్శించడానికి అగ్రశ్రేణి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్లో అనుభవాలను పంచుకోవడానికి పాకిస్థాన్ సూపర్ లీగ్ వేదికగా ఉంది. నా కెరీర్లో భారత్ అభిమానుల నుండి ఎంతో ఆదరణ పొందాను. భారత్లో క్రికెట్ ఆడటాన్ని ఎంతో ఆస్వాదించా. వాళ్లు చూపించే ప్రేమ, గౌరవాన్ని ఎప్పుడూ అభినందిస్తుంటా. సామాజిక వేదికల్లో ఇండియా నుండి కూడా సందేశాలు వస్తుంటాయి. వాటిలో ఎంతోమందికి బదులిచ్చాను.'' అని అఫ్రిది పేర్కొన్నారు.