
ఆసియా కప్ వేదికలు, మ్యాచ్ తేదీలు ఇప్పటికే ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ షెడ్యూల్ను త్వరలోనే ఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. అక్టోబర్ - నవంబర్ మధ్య వన్డే ప్రపంచకప్ మన దేశంలో జరగనుంది. ఇప్పటికే ముసాయిదా షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించగా.. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా అక్టోబర్ 15న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది.
ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజం సేథి మాట్లాడుతూ.. అహ్మదాబాద్లో ఆడతామో...? లేదో? కూడా ఇప్పుడే చెప్పలేమన్నాడు. ఈ వాఖ్యలపై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మండిపడ్డాడు ''అహ్మదాబాద్ పిచ్పై ఎందుకు ఆడకూడదని అనుకుంటున్నారో మీరు చెప్పగలరా..? అదేమైనా నిప్పులు కురిపిస్తుందా..?లేకపోతే వేటాడుతుందా? మీరు వెళ్లి అక్కడ ఆడాలి. విజయం సాధించాలి. ఇవి మీరు ఊహించిన సవాళ్లు అయితే.. అక్కడికి వెళ్లి అద్భుతమైన విజయం సాధించి వాటిని అధిగమించాలి. భారత్ను వారి సొంత మైదానంలో ఓడించడానికి వచ్చిన అవకాశాలపై పీసీబీ దృష్టిపెట్టాలి. అంతేకానీ వెనుకడుగు వేయకూడదు. ఏదైనా సరే సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలి. భారీ ప్రేక్షకుల మధ్య విజయం సాధిస్తే ఆ మజానే వేరు'' అని షాహిద్ తెలిపాడు.