Feb 16,2023 21:15

వాషింగ్టన్‌ : వ్యయాలను తగ్గించుకోవడానికి వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ మాతృసంస్థ మెటా తమ సిఇఒకు మాత్రం భారీ మొత్తంలో చెల్లింపులు పెంచడానికి సిద్ద పడింది. మెటా సిఇఒ మార్క్‌ జూకర్‌బర్గ్‌ సెక్యూరిటీ అలవెన్స్‌ను ఏకంగా 14 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.115 కోట్లు) పెంచింది. ఇంతక్రితం ఈ అలవెన్స్‌ 4 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.33 కోట్లు)గా ఉంది. ఓ వైపున ఉద్యోగులను తొలగిస్తూ.. మరోవైపు కంపెనీ బాస్‌ ఇంత ప్యాకేజీని పెంచుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. 2021లో జూకర్‌బర్గ్‌ అన్ని రకాల పరిహారాలను కలుపుకొని 27 మిలియన్‌ డాలర్ల (రూ.223 కోట్లు) వేతనాన్ని అందుకున్నారు. మెటాలో పని చేస్తున్న 11వేల మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు ఇటీవల ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.