Jul 12,2023 08:52

వర్షాకాలంలో తేమ, నీటి కాలుష్యం వల్ల బ్యాక్టీరియా, కీటకాలు తయారవుతాయి. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా తలెత్తుతాయి. తేమ బ్యాక్టీరియా విరేచనాలు, అజీర్ణం, కడుపులో ఇన్ఫెక్షన్ల వంటి వివిధ వ్యాధులకు దారితీస్తుంది. వీటి బారిన పడకుండా ఇంట్లోనే చిన్న చిట్కాలతో బయటపడవచ్చు. అవేంటో చూద్దాం.

తులసి : తులసిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీవైరల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. తులసి ఆకులను తినడం కానీ.. తులసి టీని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇంకా ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది.

అల్లం : అల్లం ఉండే యాంటీ ఇన్‌ప్లేమేటరీ, యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. అల్లం టీ తీసుకోవడం లేదా ఆహారంలో అల్లం భాగం చేసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.

వెల్లుల్లి : వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్‌, రోగనిరోధక శక్తిని పెంచే అల్లిసిన్లో సమృద్ధిగా ఉంటుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వంటలో భాగం చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్‌లను నివారించవచ్చు. వెల్లుల్లితో కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించవచ్చు. దీంతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అశ్వగంధ : అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అశ్వగంధ పౌడర్‌ లేదా క్యాప్సూల్స్‌ తీసుకోవడం వల్ల వాతావరణంలో మార్పును తట్టుకునే, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే శక్తి శరీరానికి అందుతుంది.

వేప : వేపలో యాంటీమైక్రోబయల్‌, యాంటీవైరల్‌ లక్షణాలు ఉంటాయి. వేప ఆకులు లేదా వేప ఆధారిత ఉత్పత్తులను తీసుకోవడం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే మలేరియా, డెంగ్యూ, ఫ్లూ వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు.