Nov 14,2022 21:52

న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ) 8.39 శాతానికి తగ్గి.. 19 నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చిందని ప్రభుత్వ గణంకాలు తెలిపాయి. ప్రధానంగా ఇంధనం, తయారీ వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2021 మార్చిలో కనిష్టంగా 7.89 శాతంగా నమోదు కాగా.. ఆ తర్వాత నుంచి పెరుగుతూనే వచ్చింది. గడిచిన సెప్టెంబర్‌లో ఈ సూచీ 10.79 శాతంగా, గతేడాది అక్టోబర్‌లో ఏకంగా 13.83 శాతంగా నమోదయ్యింది. గడిచిన నెలలో ముఖ్యంగా ఖనిజ చమురు, ప్రాథమిక లోహాలు, లోహ ఉత్పత్తులు, వస్త్రాలు, ఖనిజాల ధరలు తగ్గడంతో డబ్ల్యుపిఐ తగ్గిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ తెలిపింది.

తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం
గడిచిన అక్టోబర్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 6.77 శాతానికి తగ్గి మూడు మాసాల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. అహారోత్పత్తుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కేంద్ర గణంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) తెలిపింది. అయినప్పటికీ ఆర్‌బిఐ లక్ష్యానికంటే ఎక్కువగానే ద్రవ్యోల్బణం నమోదయ్యింది. సిపిఐని 2-6 శాతం మధ్యన కట్టడి చేయాలని ఆర్‌బిఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతక్రితం సెప్టెంబర్‌ మాసంలో సిపిఐ 7.41 శాతంగా నమోదయ్యింది.