Aug 27,2023 21:30

సైబర్‌ నేగరాళ్లు ఎప్పటికప్పుడు తమ పంథా మారుస్తున్నారు. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు సఅష్టించి ఫ్రెండ్స్‌ జాబితాలో ఉన్న వారిని డబ్బులు అడగడం, కరెంట్‌ బిల్లు కట్టాలంటూ వాట్సాప్‌ ద్వారా అలర్ట్‌ మెసేజ్‌లు పంపి డబ్బులు దోచుకోవడం వంటి సైబర్‌ మోసాల గురించి ఇటీవల కాలంలో ఎక్కువగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు వీరు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. అమెరికాకు చెందిన అధికారుల్లా నటిస్తూ.. వినియోగదారుల అవగాహన లోపాలను వాడుకొని వాట్సాప్‌ వేదికగా డబ్బును కాజేయాలని చూస్తున్నారు.
అమెరికాకు చెందిన పెద్ద కంపెనీ ఉన్నతాధికారుల్లా, సహౌద్యోగుల్లా, ప్రముఖ కంపెనీలకు చెందిన సీఈఓలుగా నటిస్తూ కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. వీటి కోసం ఇతర దేశాలకు చెందిన నకిలీ ఫోన్‌ నంబర్లు వినియోగిస్తున్నారు. ఇలా.. ఓ ప్రముఖ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు అమెరికాకు చెందిన నంబర్‌ నుంచి అనేక సార్లు వాట్సాప్‌ నుంచి ఫేక్‌ కాల్స్‌ వచ్చాయి. 'ఈ మెసేజ్‌ చూశాక ఫోన్‌ చేయండి. ధన్యవాదాలు' అంటూ అచ్చం అధికారుల నుంచి వచ్చే సందేశంలానే వారికి మెసేజ్‌లు వచ్చాయని తెలిపారు. వాట్సాప్‌తో పాటు ఏ ఇతర యాప్‌ల నుంచి ఇలాంటి ఫేక్‌ మెసేజ్‌లు వచ్చినా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం లేదా డబ్బును దోచుకోవడమే లక్ష్యంగా మోసగాళ్లు ఇటువంటి కొత్త పంథాను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలియని అకౌంట్‌ నుంచి ఎలాంటి లింక్‌ వచ్చినా ఆ ఖాతాను వెంటనే బ్లాక్‌ చేయండి. వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోండి. బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వై-ఫైని వినియోగించకపోవడమే ఉత్తమం.