- డాటెడ్ భూములకు శాశ్వత పరిష్కారమెన్నడో !
- పెండింగ్లో 68 వేలకు పైగా దరఖాస్తులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రైతులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం..సాంకేతిక కారణాలు వెరసి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం..చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం పొందేందుకు రైతులు 'స్పందన' కార్యక్రమంలో వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేయవచ్చు. వినతిపత్రాలు స్వీకరించిన తేదీ నుంచి సంబంధిత అధికారులు రైతులకు 180 రోజుల్లో పరిష్కారం చూపించాల్సివుంది. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు విచారణల పేరిట కాలక్షేపం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో చుక్కల భూమలకు సంబంధించి అందిన దరఖాస్తుల్లో పరిష్కారం పొందినవాటిని వేలు మీద లెక్కించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 68 వేల పైబడి దరఖాస్తులు నేటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు.
చుక్కల భూములంటే..
ఆంగ్లేయుల పాలనాకాలంలో భూముల సర్వే చేపట్టిన సందర్భంలో 'యజమానులు లేని భూమలను, పన్ను చెల్లంచలేని వారి ఆధీనంలో ఉన్న భూములను 'చుక్క' భూములుగా పేర్కొనేవారు. అలాగే వెంకటగిరి రాజుల పరగణాల్లో క్షేత్రస్థాయి దస్త్రాల్లో (ఎఫ్ఎల్ఆర్) పేర్కొన్న ఇనామ్ భూములను 'గయాల' భూములుగా రికార్డుల్లో పేర్కొనేవారు. వీటితో పాటుతో ఇతర కారణాల వల్ల యాజమాన్య నిర్ధారణపై స్పష్టత లేని భూములకు సంబంధించిన సర్వే నంబర్లు వద్ద 'చుక్కలు' పెట్టడం పరిపాటి అయ్యింది. ఇప్పుడు ఆ చుక్కలే రైతులకు, భూహ క్కుదార్లకు చుక్కలు చూపిస్తున్నాయి. క్రయవిక్రయాలకు, విత్తనాలు, ఇతర రాయితీ పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ 'చుక్కలు' అడ్డుగా నిలుస్తున్నాయి. వీటిని తొలగించుకొని శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. రీ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్)లో సవరణలను చేయించుకోవడం రైతులకు నానా ఇబ్బందులకు గురిచేస్తోందన్న విమర్శ లున్నాయి. రైతులు తమ దరఖాస్తుతో పాటు ఆర్ఎస్ఆర్ నకలు, 10(1) కాపీ, భూమికి సంబంధించిన పట్టా, తప్పనిసరిగా జతపరచాల్సి ఉంటుంది. వీటితో పాటు అత్యంత కీలకమైన డాక్యుమెంట్గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉండే రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్ (ఆర్హెచ్ రికార్డు) కాపీని జత చేయాలి. కానీ అనేక ప్రాంతాల్లో ఆర్ఎస్ఆర్ వివరాలు , ఆర్హెచ్ కాపీలోని వివరాలతో సరిపోలడం లేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. లింక్ డాక్యుమెంట్లు సమర్పించలేక పోవడం కూడా దరఖాస్తుల పెండింగ్, తిరస్కరణకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అయితే రెవెన్యూ కార్యాలయాల్లో ఉండాల్సిన దస్త్రాలను కూడా తామే దరఖాస్తుకు జత చేయాలంటే ఎలా సాధ్యమని రైతులు వాపోతున్నారు. 10 (1) కాపీ, పట్టాదారు పాసు పుస్తకాలు అయితే సమర్పించగలమని, ఇతర పత్రాలు తాము ఎక్కడ నుంచి తేగలమని ప్రశ్నిస్తున్నారు.
అఫ్రూవల్ పొందింది..3269 దరఖాస్తులే..
ప్రత్యేక డ్రైవ్లో చుక్కల భూముల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 91,566 దరఖాస్తులు రెవెన్యూ శాఖకు అందాయి. వీటిలో 22,806 దరఖాస్తులను డిస్పోజ్ చేశారు. వీటిలోనూ కేవలం 3,269 అఫ్రూవల్ పొందాయి. వివిధ కారణాల వల్ల 19,537 దరఖాస్తులను తిరస్కరించారు. రాష్ట్రం మొత్తం మీద 68,760 దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. వీటిలో పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఇంకా ఉన్న దరఖాస్తులు 2,673 ఉండగా, గడువు ముగిసినా పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులు 66,807 ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 62 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.
ప్రభుత్వమే పరిష్కరించాలి : వి వెంకటేశ్వర్లు
2014లో చుక్కల భూములను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టంగా ఉత్తర్వులు వెలువరించిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానకార్యదర్శి వి వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామ సభలు పెట్టి భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పూర్తి హక్కులు కల్పించాలన్నారు. తక్షణమే గ్రామంలో విచారణ చేపట్టి భూముల చుక్కలు తొలగించి సంబంధిత యజమానులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు.










