Oct 25,2022 14:31

న్యూఢిల్లీ : ప్రముఖ సామాజిక మీడియా, మెసెంజర్‌ వేదిక వాట్సాప్‌ సేవల్లో తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. మంగళవారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు గంటల పాటు సేవలు నిలిచి పోయాయి. సాంకేతిక సమస్య వల్ల సర్వర్‌ డౌన్‌ కావడంతో భారత్‌ సహా ఇతర దేశాల్లోనూ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సేవలు ఆగిపోయాయి. గ్రూపుల్లో సందేశాలు వెళ్లడం లేదని, వ్యక్తిగత మెసేజ్‌లు పంపిస్తే బ్లూటిక్‌ రావడం లేదని పలువురు వినియోగదారులు ట్విట్టర్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేశారు. వాట్సాప్‌కు గ్రహణం పట్టిందని మీమ్స్‌ను సృష్టించారు. వాట్సాప్‌ వెబ్‌కి కనెక్ట్‌ చేస్తున్నప్పుడు 'కనెక్టింగ్‌' అని కొన్నిసార్లు, నెట్‌వర్క్‌ కనెక్టివిటీ లేదని వస్తున్నట్లు వినియోగదారులు పేర్కొన్నారు. దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయిన సేవలను వాట్సాప్‌ మాతృసంస్థ మెటా తిరిగి పునరుద్దరించింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల మంది ఖాతాదారులున్నారు. వాట్సాప్‌ నిలిచిపోయిన సమయంలో అనేక మంది టెలిగ్రామ్‌ను ఉపయోగించుకున్నారు.