Nov 19,2023 09:49

ప్రజాశక్తి- ఎచ్చెర్ల : విశాఖపట్నం గీతం యూనివర్సిటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీ శనివారం రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2019 నుంచి 2021 గీతం యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించారు. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఎచ్చెర్ల విద్యా ప్రగతికి కృషి, విద్య బలోపేతంపై ప్రత్యేక దృష్టి, అకడెమిక్‌ క్లాస్‌ వర్క్‌ నిర్వాహణకు ప్రత్యేక చర్యలు, విద్యార్థుల్లో ఉద్యోగ స్కిల్స్‌ ప్రాధాన్యత, రాష్ట్రస్థాయిలో ఉత్తమ విద్య సంస్థగా తీర్చేందుకు కృషి, ఒత్తిడి లేని విద్య అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రొఫెసర్‌ జగదీశ్వరరావు నుంచి గోపాల వెంకట ధన బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఒఎస్‌డి సుధాకర్‌బాబు, పరిపాలన అధికారి మునిరామకృష్ణ, డీన్‌ కోర్లమోహన్‌ కృష్ణ చౌదరి, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ సల్లా ఆసిరినాయుడు, వెల్ఫేర్‌ డీన్‌ రవి, డిప్యూటీ ఎఒ రఘుపతిరావు, పిఆర్‌ఒ మామిడి షణ్ముఖ, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయా న్ని సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణా ధికారి వి.హరిసూర్యప్రకాష్‌ స్వామి చిత్రపటాన్ని అందజేశారు.