May 06,2023 21:02

క్యూ4 లాభాల్లో 93% వృద్థి
తగ్గిన మొండి బాకీలు

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యుబిఐ) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు సాధించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 93.3 శాతం వృద్థితో రూ.2,782 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.1,440 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన త్రైమాసికంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 21.88 శాతం పెరిగి రూ.8,251 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 62.48 శాతం వృద్థితో రూ.5,269 కోట్లుగా చోటు చేసుకుంది.
2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.3 లేదా 30 శాతం డివిడెండ్‌ను ప్రతిపాదిస్తూ యుబిఐ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. బ్యాంక్‌ కరెంట్‌ ఎకౌంట్‌, సేవింగ్‌ ఎకౌంట్‌ (కాసా) డిపాజిట్లు 4.47 శాతం పెరిగి రూ.11,17,716 కోట్లకు చేరాయి. అడ్వాన్సులు 13.05 శాతం వృద్థితో రూ.8.09 లక్షల కోట్లుగా చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 358 బేసిస్‌ పాయింట్లు తగ్గి 7.53 శాతానికి దిగివచ్చాయి. 2022 ఇదే సమయం నాటికి 11.11 శాతం జిఎన్‌పిఎ నమోదయ్యింది. నికర నిరర్థక ఆస్తులు 198 బేసిస్‌ పాయింట్లు తగ్గి 3.68 శాతం నుంచి 1.70 శాతానికి పరిమితం కావడంతో ఆ బ్యాంక్‌ మెరుగైన ప్రగతిని కనబర్చినట్లయ్యింది.