Feb 18,2023 17:27

హైదరాబాద్‌ :నష్టాలను నివారించుకునేందుకు ట్విట్టర్‌ సంస్థ ఎన్నో కొత్త పాలసీలను తీసుకొస్తున్నది. ఇప్పటికే హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న వివిధ వస్తువులను వేలానికి పెట్టిన ట్విట్టర్‌ సంస్థ.. తమ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్‌ తగ్గించివేసింది. ఉద్యోగుల్లో కోతను విధించిన ట్విట్టర్‌ సంస్థ.. బ్లూ టిక్‌ కోసం రుసుం చెల్లించాలని వినియోగదారులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నది. తాజాగా మరో కొత్త పాలసీతో డబ్బులు దండుకోవడానికి ముందుకు వచ్చింది. రెండు ఫ్యాక్టర్‌ ఆథెంటికేషన్‌ (2ఎఫ్‌ఏ) విధానానికి సంబంధించి ట్విట్టర్‌ కొత్త ప్రకటన చేసింది. వినియోగదారులు తమ ఖాతాలను భద్రపరుచుకునేందుకు రెండు కారకాల ఆథెంటికేషన్‌ పద్ధతిగా టెక్స్ట్‌ సందేశాలను పంపేందుకు ఉపయోగించడానికి ఇప్పుడు పెయిడ్‌ సబ్‌స్క్రైబర్లను మాత్రమే అనుమతిస్తామని వెల్లడించింది. ఈ పద్ధతి కింద బ్లూ టిక్‌ సబ్‌స్క్రైబర్లు మాత్రమే మార్చి 20 నుంచి టెక్స్ట్‌ మెసేజ్‌లను వారి 2ఎఫ్‌ఏ పద్ధతిగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇతర ఖాతాల వారు 2ఎఫ్‌ఏ ప్రమాణీకరణ యాప్‌ లేదా సెక్యూరిటీ కీని ఉపయోగించవచ్చునని పేర్కొన్నది.