Sep 14,2023 16:01

గువహటి :   అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉప నేత గౌరవ్‌ గొగోయ్  మధ్య ఎక్స్‌ (ట్వీట్ల) వార్‌ కొనసాగుతోంది.  తన భార్య కేంద్రం నుండి ఏదైనా మొత్తాన్ని స్వీకరించినట్లు లేదా క్లెయిమ్‌ చేసినట్లు ఆధారాలుంటే .. తాను ఏశిక్షకైనా సిద్ధమేనని అసోం ముఖ్యమంత్రి గురువారం ట్వీట్‌ చేశారు. అవసరమైతే రాజకీయ జీవితం నుండి రిటైర్‌ అవుతానని స్పష్టం చేశారు. నా భార్య కానీ లేదా ఆమె భాగస్వామ్యం కలిగి ఉన్న కంపెనీ కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి నగదు పొందలేదని  అన్నారు. ఒకవేళ ఎవరైనా సాక్ష్యాలు చూపితే.. ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని తెలిపారు.

ఈ ఏడాది మార్చిలో అసోం బిజెపి ఎంపి పల్లబ్‌ లోచన్‌ దాస్‌ లోక్‌సభలో అడిగిన పశ్న్రకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ఇచ్చిన సమాధానాన్ని గొగోయ్  పోస్ట్‌ చేసిన అనంతరం ఇరువురి నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది.   గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారూ కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఫిర్యాదు చేస్తున్నారా అని ప్రశ్నించారు. హిమంత బిస్వా శర్మకు భార్యకు మాత్రమే మంజూరు చేయడాన్ని ఆమోదించారా.. అని ఎద్దేవా చేశారు.  కానీ హిమంత బిస్వా శర్మ నగదు  విడుదల కాలేదని చెబుతున్నారు. ఇంకాఎంతమంది బిజెపి నేతలు తమ కుటుంబాలను సుసంపన్నం చేసుకునేందుకు పిఎంకెఎస్‌వై పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని గొగోయ్  ట్వీట్‌ చేశారు.