Nov 11,2023 16:17

గువహటి  :   అస్సాంలో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు తమ పదవులకు శనివారం రాజీనామా చేశారు. అస్సాం ప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొరితుష్‌ రాయ్, నాగోన్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు సురేష్‌ బోరాలు తమ పదవులకు రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నాగోన్‌ జిల్లా అధ్యక్షునిగా పనిచేయడం గౌరవంగా ఉందని సురేష్‌  బోరా రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తనకు అవకాశాలు, మద్దతు అందించిన పార్టీ సభ్యులకు కృతజ్ఞతలని అన్నారు. అయితే మారుతున్న పరిస్థితుల రిత్యా పదవి నుండి వైదొలగడం తనకు మరియు పార్టీకి రెండింటికి మేలు చేస్తుందని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో బర్హంపూర్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సురేష్‌ బోరా బిజెపి అభ్యర్థి జితు గోస్వామి చేతిలో 751 ఓట్ల తేడాతో ఓడిపోయారు.  పార్టీలో తాను కొనసాగలేనని పొరితుష్‌ రాయ్  తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. వీరిద్దరూ బిజెపి గూటికి చేరనున్నట్లు సమాచారం.