ప్రజాశక్తి-పలమనేరు(చిత్తూరు) : రోడ్డు దాటుతుండగా వ్యాన్ ఢ కొట్టడంతో మూడు ఏనుగులు మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లాలోని పలమనేరు బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని జాతీయ రహదారికి ఇరువైపులా అడవులు ఉంటాయి. దీంతో రోడ్డు ఇరువైపులా ఉన్న అడవులలో నుంచి అటు ఇటు ఆహారం కోసం ఏనుగులు గుంపులుగా తిరుగుతుంటాయి.ఈ క్రమంలోనే బుధవారం రాత్రి భూతలబండ వద్ద ఏనుగులు రోడ్డు దాటుతున్నాయి. ఆ సమయంలో చెన్నైకి కూరగాయల లోడుతో వెళుతున్న మినీ లారీ ఈ ఏనుగుల గుంపును ఢ కొట్టింది. దీంతో మూడు ఏనుగులు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. ఏనుగును ఢకొీట్టడంతో వ్యాన్ ముందు భాగం కూడా నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రమాదం కారణంగా పలమనేరు జాతీయ రహదారికి రెండువైపులా వెహికల్స్ భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన పలమనేరు రేంజర్ శివన్న సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేయించారు. చిత్తూరు డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ఏనుగులను ఎక్స్క్యూబేటర్ సహాయంతో.. సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించారు. గురువారం అక్కడే చనిపోయిన ఏనుగులకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రమాదానికి కారణంగా మినీ లారీ అతివేగంగా రావడం.. చీకట్లో ఏనుగులు రోడ్డు దాటుతున్న విషయాన్ని డ్రైవర్ గుర్తించకపోవడంతోనే జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసినట్లుగా అటవీశాఖ అధికారులు వెల్లడించారు.











