Apr 01,2023 21:02

న్యూఢిల్లీ : మలేషియాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం ఇక రూపాయల్లో జరుగనుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ చెల్లింపులును రూపాయల్లో చేయడానికి గతేడాది జులైలోనే ఆర్‌బిఐ అనుమతులిచ్చింది. దీంతో ఇప్పటికే రష్యా, మారిషాస్‌, శ్రీలంక దేశాలతో ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలు రూపాయల్లో జరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మలేషియా వచ్చి చేరింది. ఇప్పుడు మలేషియాతో వాణిజ్యం ప్రస్తుతమున్న కరెన్సీలతో పాటు రూపాయల్లోనూ జరగనుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందుకోసం కౌలాలంపూర్‌లోని ఇండియా ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మలేషియా(ఐఐబిఎం), భారత్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి ప్రత్యేక రూపీ వోస్ట్రో ఖాతాలను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. విదేశాలతో రూపాయి మారకంతో వాణిజ్యాన్ని నిర్వహించడం ద్వారా దేశ కరెంట్‌ లోటు, వాణిజ్య లోటు తగ్గడంతో పాటుగా రూపాయికి బలం చేకూరనుంది.