Mar 07,2023 20:39

వాషింగ్టన్‌ : ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా మరో మారు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. వచ్చే వారంలోనే ఈ తొలగింపులు ఉండొచ్చని బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్‌ చేసింది. ఆర్థిక వ్యవస్థల్లో మందగింపు, ఆదాయాలు తగ్గడంతో టెక్‌ కంపెనీలు పొదుపు చర్యలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లోనూ మెటాలో 13 శాతానికి సమానమైన 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా మరోసారి వేటు వేయనుందని తెలుస్తోంది. ఎవర్ని తొలగించాలో చెప్పాలంటూ డైరెక్టర్లు, వైస్‌ ప్రెసిడెంట్లు, ఉన్నతాధికారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. వచ్చే వారంలోనే ఈ ఉద్వాసనలు ఉండొచ్చని రిపోర్టులు వస్తున్నాయి. మేనేజర్లకు ప్యాకేజీ ఇచ్చి పంపించడానికి ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించింది. ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేసేందుకు సిద్దమయ్యిందని సమాచారం. మెటా చీఫ్‌ జూకర్‌బర్గ్‌ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి తొలగింపులు తప్పడం లేదని ఓ ఉద్యోగి పేర్కొన్నారు.
వ్యయాలను తగ్గించుకోవడానికి వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న మెటా తమ సిఇఒకు మాత్రం ఇటీవల భారీ మొత్తంలో చెల్లింపులు పెంచాలని నిర్ణయించింది. మెటా సిఇఒ మార్క్‌ జూకర్‌బర్గ్‌ సెక్యూరిటీ అలవెన్స్‌ను ఏకంగా 14 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.115 కోట్లు) పెంచింది. ఇంతక్రితం ఈ అలవెన్స్‌ 4 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.33 కోట్లు)గా ఉంది. ఓ వైపున ఉద్యోగులను తొలగిస్తూ.. మరోవైపు కంపెనీ బాస్‌ ఇంత ప్యాకేజీని పెంచుకోవడం గమనార్హం. 2021లో జూకర్‌బర్గ్‌ అన్ని రకాల పరిహారాలను కలుపుకొని 27 మిలియన్‌ డాలర్ల (రూ.223 కోట్లు) వేతనాన్ని అందుకున్నారు.