
'ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు...' అంటూ మంచి, చెడుల గురించి చెప్పిన.. 'అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను..' అంటూ వ్యక్తిత్వాల గురించి వివరించిన.. 'పిండములను జేసి పితరుల దలపోసి.. అంటూ ఐదొందల ఏళ్లక్రితమే మూఢ నమ్మకాలను దునుమాడిన వేమన పద్యాలను వల్లెవేయని తెలుగువారుండరు. సమాజ చరిత్రను పండిత, పామరులకు అర్థమయ్యే భాషలో రాసిన ప్రజాకవి వేమన. సరళమైన తెలుగులో లోతైన భావంతో నీతిని జోడించి సౌమ్యంగా పద్యాన్ని చెప్పడం వేమనకే సాధ్యం. అటువంటి పద్యాలను ఆకలింపు చేసుకోవడమే కాక నేటి సమాజ పోకడలను ప్రస్ఫుటిస్తూ అందమైన బొమ్మల రూపంలో సాక్షాత్కరించారు కొంతమంది చిత్రకారులు.
సాహిత్యచరిత్రలో ఎందరో కవులకు గొప్ప స్ఫూర్తిప్రదాతగా వెలుగొందే వేమనను స్మరించుకుంటూ సెప్టెంబరు 28 గుర్రం జాషువా 127వ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న జాషువా సాంస్క ృతిక వేదిక, ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్స్, ఆంధ్రా ఆర్ట్స్ అకాడెమీ, ఫొటో ఇండియా, సుమధుర కళానికేతన్, శ్రీ నటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడెమీ తదితర సాంస్క ృతిక సంస్థలు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ప్రజాకవిని స్మరించుకుంటూ వేమన పద్యాలను ప్రతిబింబించే చిత్రలేఖనాలకు పిలుపునిచ్చారు. ఇంతవరకు ఎవరూ ఎక్కడా తలపెట్టని ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఆశ్చర్యపోయే రీతిలో చిత్రలేఖనాలు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందకు పైగా వచ్చిన వాటితో విజయవాడ బాలోత్సవ్ భవన్లో సెప్టెంబరు 21న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
ఐదొందల ఏళ్ల క్రితమే సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సాంస్క ృతికపరంగా సమాజ చరిత్రను చాటిచెప్పిన వేమన దార్శనికతను చిత్రకారులు తమ కుంచెలతో చూపించిన తీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ పద్యాలను ఆకలింపు చేసుకున్న చిన్నారులు తమ చిట్టిచేతులతో అందమైన బొమ్మను వేసి భావంతో సహా వర్ణించిన తీరు హర్షించదగ్గ పరిణామం.
ఇలా.. ఈ ఎగ్జిబిషన్లో ఇలాంటి ఎన్నో చిత్రాలు వీక్షకులను విశేషంగా అలరించాయి. ఐదు ఉత్తమ చిత్రాలకు గాను ప్రశంసాపత్రాలు, పారితోషికాలను అందించారు. ఈ చిత్రాలన్నింటినీ పుస్తకరూపంలో తీసుకురావాలన్న అతిథుల కోరికను ఆచరణలో పెడతామని నిర్వాహకులు చెప్పారు.
ఆధునిక పోకడలతో ఉరుకులు పరుగుల జీవితాలతో పరుగెడుతున్న ప్రజానీకం కళలు, కళారంగం వైపు చూడడమే మానేశారు. తాత్కాలిక ఆనందం కోసం వెచ్చించే ప్రతి వెసులుబాటు క్షణకాలమే గుర్తుంటుంది. కాని కళలు, కళాకారులు, జానపదాలు, నృత్యాలు వంటివన్నీ జీవితకాలం వెంటాడే స్మ ృతులు. ఇంత గొప్ప అనుభూతిని విజయవాడ ప్రజానీకానికి అందిస్తున్న బాలోత్సవ్ నిర్వాహకులు అభినందనీయులు.

ధనంబు కూడబెట్టి దానంబు సేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ కూర్చి తెఱువరి కియ్యదా
విశ్వదాభిరామ వినురవేమ ! అను పద్యాన్ని వివరిస్తూ వేసిన చిత్తరువు 8వ తరగతి పిల్లవాడు వేశాడని తెలిసినప్పుడు బాల్యంలోనే ఇంతటి పరిజ్ఞానం సంపాదించిన అతనిని మెచ్చుకోకుండా ఉండలేం.

తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమీ
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ ! అంటూ 9వ తరగతి విద్యార్థిని వేసిన చిత్తరువుకు ఎంచుకున్న అంశం ఆ బాలిక విషయ పరిజ్ఞానాన్ని తెలుపుతోంది.

చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువ కాదు
విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ ! అంటూ తెలంగాణ సత్తుపల్లి నుంచి వచ్చిన చిత్తరువు మనసుపెట్టి ఏదైనా పనిచేస్తే ప్రతిఫలం ఎంత అందంగా వస్తుందో చెప్పడాన్ని ప్రతిబింబించింది.

కనకమృగము భువిని గద్దు లే దనకను
తరుణి విడిచి చనియె దాశరధియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా
విశ్వదాభిరామ వినురవేమ !
అను పద్యాన్ని వివరిస్తూ శ్రీకాకుళం విద్యార్థి వేసిన చిత్తరువు ఆ చిన్నారి అభ్యుదయ భావజాలానికి అద్దం పడుతోంది.

విద్య లేనివాడు విద్యాధికుల చెంత
నుండినంత పండితుండుకాడు
కొలని హంసలకడ గొక్కెర యున్నట్టు !
విశ్వదాభిరామ వినురవేమ ! అన్న పద్యమును వివరిస్తూ చిత్రకారుడు వేసిన చిత్రకళ పద్యం భావాన్ని కళ్లకు కట్టినట్లుగా చెబుతోంది.
- జ్యోతిర్మయి