దీపమ్ సెక్రటరీ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఐడిబిఐ బ్యాంక్ ప్రయివేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) సెక్రటరీ తూహిన్ కాంత్ పాండే తెలిపారు. బ్యాంక్ విక్రయాన్ని వాయిదా వేయనున్నారనే రిపోర్టులను ఆయన ఖండించారు. అనుకున్న ప్రణాళిక ప్రకారమే అమ్మకపు ప్రక్రియ సాగుతుందన్నారు. ఐడిబిఐ బ్యాంక్ కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారి నుంచి బిడ్డింగ్లు స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం బిడ్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వం, ఆర్బిఐ నుంచి ఆమోదం లభించక తదుపరి దశ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ బ్యాంక్లో ఎల్ఐసికి, ప్రభుత్వానికి కలిపి 94.72 శాతం వాటా ఉంది. ఇందులో 61 శాతం వాటాను అమ్మకానికి పెట్టారు. పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత కేంద్రానికి 15 శాతం, ఎల్ఐసికి 34 శాతం వాటా మిగలనుంది. 2023-24 ద్వితీయార్థం నాటికి ఐడిబిఐ బ్యాంక్ను ప్రయివేటీకరించే అవకాశం ఉంది.










