Apr 26,2023 20:36
  • తెలుగు రాష్ట్రాల్లో మరో 10 శాఖలు
  • వి-ట్రాన్స్‌ ఛైర్మన్‌ వెల్లడి

హైదరాబాద్‌ : ఆర్థిక సంవత్సరం 2025-26 నాటికి రూ.3,000 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లాజిస్టిక్స్‌ సంస్థ వి-ట్రాన్స్‌ ఛైర్మన్‌ మహీంద్రా షా తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ షాతో కలిసి మహీంద్రా షా మాట్లాడారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1450 కోట్ల టర్నోవర్‌ సాధించామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం వృద్థితో రూ.1,800 కోట్ల రెవెన్యూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమకు ప్రస్తుతం 50 శాఖలు ఉన్నాయని తెలిపారు. ఏడాదిలో మరో 10 శాఖలను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నామన్నారు. దేశ వ్యాప్తంగా 10 లక్షల చదరపు అడుగుల గిడ్డంగులు ఉన్నాయని.. వీటిని 20 లక్షల చదరపు అడుగులకు విస్తరించుకోవాలని యోచిస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తమకు 1000 పైగా శాఖలున్నాయని.. వచ్చే ఏడాది కాలంలో మరో 100 శాఖలను తెరువనున్నామన్నారు.