Nov 15,2023 21:02

అక్టోబర్‌లో 31.46 బిలియన్లకు చేరిక
ఎగిసిన దిగుమతులు
న్యూఢిల్లీ : భారత ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో వాణిజ్య లోటు రికార్డ్‌ స్థాయిలో ఎగిసిపడింది. ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో 65.03 బిలియన్‌ డాలర్ల వాణిజ్య దిగుమతులు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో సరుకుల ఎగుమతులు 33.57 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయని కేంద్ర వాణిజ్య శాఖ గణంకాలు వెల్లడించాయి. దిగుమతులు అధికంగా ఉండటం, ఎగుమతులు తక్కువగా ఉండటంతో రికార్డ్‌ స్థాయిలో 31.46 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు చోటు చేసుకుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచడంతో పాటు అనేక ఉత్పత్తుల ధరలు పెరగడానికి ఆజ్యం పోసే ప్రమాదం ఉంది. గడిచిన నెలలో 20.50 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు చోటు చేసుకోవచ్చని రాయిటర్స్‌ పోల్‌లో నిపుణులు అంచనా వేయగా.. ఇది అమాంతం పెరగడం గమనార్హం. 2022 ఇదే అక్టోబర్‌లో 26.31 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు చోటు చేసుకుంది. అదే సమయంలో 57.91 బిలియన్ల దిగుమతులు, 31.60 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. 2023 సెప్టెంబర్‌లో 34.47 బిలియన్ల ఎగుమతులు, 53.84 బిలియన్ల దిగుమతులు నమోదయ్యాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాల అభివఅద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ప్రపంచ వఅద్ధి మందగించడం వల్ల భారత ఎగుమతులు ప్రభావితమయ్యాయి. ఈ దేశాలు కూడా ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లను కఠినతరం చేయడాన్ని చూస్తున్నాయి. ఇది వ్యాపారం, వాణిజ్యంలో మందగమనానికి దారి తీస్తుంది.
''గడిచిన అక్టోబర్‌లో వార్షిక ప్రాతిపదికన బంగారం దిగుమతులు 95 శాతం పెరిగాయి, ఇది వాణిజ్య లోటును పెంచడానికి దారితీసింది. నవంబర్‌లో దీపావళి పండుగ కారణంగా అక్టోబర్‌లో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఏడాది అక్టోబర్‌లో దీపావళి జరుపుకున్నాము. 2023లో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి.'' అని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ బర్త్వాల్‌ విలేకరులతో పేర్కొన్నారు.
''వాణిజ్య లోటు పెరగడంతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. గత రెండేళ్లుగా తగ్గుతున్న మూలధన ప్రవాహాలు, అధిక వడ్డీ రేట్ల కారణంగా రూపాయి విలువ పుంజుకోవడానికి కూడా సమయం పట్టవచ్చు. వాణిజ్య లోటును పెంచుతూ ఉంటే, రుణాలు తీసుకునే నిబంధనలు కఠినంగా మారతాయి. దీంతో మన తయారీ రంగాలను మనం ఎలా నిర్వహిస్తాం. ప్రస్తుతం అధిక ఎగుమతులకు డిమాండ్‌ను కనుగొనలేని ఉత్పాదక రంగాల అసమర్థత ఆందోళనకరం. ఎగుమతులను మెరుగుపరచడానికి కొత్త మార్గాలను కనుగొనవలసి ఉంటుంది.'' అని జెఎన్‌యు ప్రొఫెసర్‌ బిశ్వజిత్‌ ధర్‌ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల ఉత్పత్తులతో పోటీ పడలేకపోవడం, గ్లోబల్‌ డిమాండ్‌లోనూ స్తబ్దత నేపథ్యంలో భారత ఎగుమతులు తగ్గిపోతున్నాయని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.