Mar 31,2023 21:02

హెచ్చు ధరలకు ఆ ఐదు గ్రూపులే కారణం
ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయి
చిన్న సంస్థలను మింగేస్తున్నారు..
ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విమర్శలు

న్యూఢిల్లీ : భారత్‌లో అధిక ధరలకు ఐదు బడా కార్పొరేట్‌ కంపెనీలే కారణమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య స్పష్టం చేశారు. రిలయన్స్‌ గ్రూపు, అదాని, టాటా, ఆదిత్యా బిర్లా, భారతి టెలికం గ్రూపు కంపెనీలు గుత్తాదిపత్యంతో ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తూ.. ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నాయన్నారు. అవి భారత్‌లో వివిధ ఉత్పత్తులు, సేవల ధరల్ని అమాంతం పెంచే శక్తిని కలిగి ఉన్నాయన్నారు. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు తగ్గినప్పటికీ ఈ దిగ్గజ కార్పొరేట్‌ వర్గాలు ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయన్నారు. బ్రూకింగ్‌ ఇన్స్‌ట్యూట్‌ కాన్ఫరెన్స్‌లో ఆచార్య ఓ పత్రాన్ని ప్రవేశపెట్టారు. అందులో కార్పొరేట్ల ఆగడాలను ఎండగట్టారు. ధరల్ని నిర్ణయించే శక్తి కార్పొరేట్‌ దిగ్గజాలకు పెరుగుతూనే ఉన్నందున ద్రవ్యోల్బణం ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయన్నారు. పోటీని పెంచడానికి, ధరల శక్తిని తగ్గించడానికి ఈ గుత్తేదారులను విఛ్చిన్నం చేయాలన్నారు. 2017 జనవరి 23 నుంచి 2019 జులై 23 మధ్య మధ్య ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా విరాల్‌ ఆచార్య పని చేశారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌ యూనివర్శిటీ స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆయన పత్రంలో పేర్కొన్న అంశాలు.. ''అధిక ధరలకు కారణమవుతున్న ఈ వాణిజ్య గ్రూప్‌లను విచ్ఛిన్నం చేయాల్సి ఉంది. ఆ ఐదు దిగ్గజ గ్రూపులు స్థానిక చిన్న సంస్థల్ని దిగమింగి బడా గ్రూపులుగా ఎదిగాయి. రిటైల్‌ వ్యాపారం, సహజ వనరులు, టెలికమ్యూనికేషన్ల రంగాల్లో ధరల్ని పెంచే శక్తి వీటికే ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు ఆ కార్పొరేట్లు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం భారీగా పెంచేసిన దిగుమతి సుంకాలతో విదేశీ పోటీ సంస్థల నుంచి దేశంలోని పెద్ద వాణిజ్య గ్రూప్‌లు రక్షణ పొందుతున్నాయి. జాతీయ వాణిజ్య చాంపియన్లను తయారు చేయడం నవ భారత్‌ పారిశ్రామిక విధానమని చెపుతున్నారు. కానీ ఈ విధానం పరోక్షంగా అధికస్థాయిలో ధరలు కొనసాగేలా చేస్తుంది. మార్కెట్లో పోటీ పెరగడానికి, ధరల్ని నిర్ణయించే శక్తిని తగ్గించడానికి కార్పొరేట్‌ దిగ్గజాలను విడగొట్టాలి.'' అని విరాల్‌ ఆచార్య అన్నారు.
''కార్పొరేట్‌ దిగ్గజాలను విడగొట్టలేకపోతే వాటి వృద్థి చక్రాల్లో ఇసుక పోయాలి. అప్పుడు వాటికి ఆర్థికంగా గిట్టుబాటు కాదు. ముడి పదార్థాల ధరలు బాగా తగ్గినప్పటికీ, భారత వినియోగదారులకు ఆ ఫలాలు పూర్తిగా అందడం లేదు. లోహాలు, బగ్గు, పెట్రోలియం, రిఫైనరీ ఉత్పత్తులు ఆ ఐదు దిగ్గజాల చేతుల్లోనే ఉన్నాయి. ఇవి కాకుండా రిటైల్‌ వ్యాపారం, టెలికం సర్వీసుల్లో కూడా వారే గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్నారు. 2010 తర్వాత విత్త యేతర రంగాలను పూర్తిగా చేజిక్కించుకోవడంపైనే ఆ ఐదు కార్పొరేట్‌ దిగ్గజాల దృష్టి పడింది. అనుకున్నట్లుగానే 2015-16 నాటికి పలు రంగాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. వ్యాపారాలను భారీగా పెంచుకున్నారు. దేశంలో టాప్‌ 5 కంపెనీలుగా ఎదిగాయి. ఇతరుల చేతుల్లోని ఉన్న కంపెనీల్లోని మెజారిటీ వాటాలను చేజిక్కించుకోవడం ప్రారంభించారు. దివాళా తీసిన కొన్ని పెద్ద సంస్థలను స్వాధీనం చేసుకున్నాయి. ఇది వాటి మరింత వృద్థికి దోహదం చేశాయి.'' అని విరాల్‌ విశ్లేషించారు.
''కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ధరలు తగ్గినప్పటికీ.. సరఫరా అడ్డంకులు తొలగిపోతున్నందున అంతర్జాతీయంగా వస్తూత్పత్తుల ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ భారత్‌లో హెచ్చు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. దేశంలో వడ్డీ భారాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కోవిడ్‌ తర్వాత వస్తువులకు డిమాండ్‌ బలహీనంగా ఉంది. అయినప్పటికీ దేశంలో హెచ్చు ధరలు కొనసాగుతున్నాయి. దేశంలో తయారీదారుల మార్జిన్లు ఎక్కువగా ఉండటం కూడా అధిక ధరలకు కారణం. పోటీని పెంచడానికి, ధరల శక్తిని తగ్గించడానికి ఈ గుత్తేదారులను విఛ్చిన్నం చేయాలి. ఇందుకోసం పోటీతత్వాన్ని పెంచడంతో పాటుగా రెగ్యూలేటరీ నియంత్రణలు పెంచాలి.'' అని విరాల్‌ అన్నారు.